సిగ్గు లజ్జా లేని నాయకుడు: ఏపీ సీఎం జగన్ ను ఘాటుగా తిట్టిన బుద్దా వెంకన్న
టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ సర్కార్ పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఒక పక్క బీసీల రిజర్వేషన్లు తగ్గించారని టీడీపీ ఆరోపిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మరో వైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. ఇక ఈ సమయంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న ఏపీ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఘాటుగా తిట్టి పోశారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి మోసం చేశారని ఆగ్రహం
సిగ్గు, లజ్జా లేని నాయకుడు వై ఎస్ జగన్ రెడ్డి అని బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీ మర్చిపోయినట్టు ఉన్నారు. ఒక సారి పాత వీడియో చూడండి అని గతంలో జగన్ ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియో తో కలిపి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు బుద్దా వెంకన్న . అంతే కాదు మూడు ముక్కలాట కోసం 5 కోట్ల వకీలుని పెట్టుకున్న జగన్ బీసీ రిజర్వేషన్ల విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించారని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు.
16,500 మంది బీసీలను పదవులకు దూరం చేస్తున్నారని విమర్శలు
నాడు తండ్రి, నేడు తనయుడు. 16,500 మంది బీసీలను పదవులకు దూరం చేస్తున్నారని మండిపడిన బుద్దా వెంకన్న వైఎస్ కుటుంబం బీసీ ద్రోహులు అనడానికి ఇంతకన్నా ఉదాహరణలు అనవసరం అని తేల్చి చెప్పాడు. ఇక బీసీ రిజర్వేషన్లు తగ్గింపుపై విమర్శలు చేస్తూ బీసీలకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్తున్న టీడీపీ న్యాయ పోరాటం చేస్తుంది. సుప్రీం కోర్టులో బీసీల రిజర్వేషన్ తగ్గింపు పై పిటీషన్ వేసింది.
Recommended Video
కోర్టు తీర్పుతో బీసీ రిజర్వేషన్లు తగ్గించిన ఏపీ ప్రభుత్వం .. బీసీ అస్త్రాన్ని వాడుతున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం కలిపి మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతేడాది డిసెంబరు 28న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 176ను రద్దు చేయడంతో పాటు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చట్టవిరుద్ధమని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో వైసీపీ సర్కార్ 50 శాతానికి రిజర్వేషన్లను కుదించింది. ఇక ఈ క్రమంలో గతంతో పోలిస్తే 10 శాతం రిజర్వేషన్లు బీసీలకు తగ్గించింది. ఇక బీసీ అస్త్రాన్ని ఇప్పుడు టీడీపీ వాడుకుంటుంది.