టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్బై: సొంతగూటికి వైసీపీ నేత: రాజ్యసభ ఛాన్స్ ఇస్తారా?
కాకినాడ: తెలుగుదేశం పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు గుడ్బై చెప్పబోతున్నారు. కాస్సేపట్లో ఆయన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయనే- చలమలశెట్టి సునీల్. ఇదివరకు వైఎస్ఆర్సీపీలో చాలాకాలం పాటు కొనసాగిన చలమలశెట్టి సునీల్.. సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత చేతిలో ఓటమి చవి చూశారు.
తాజాగా మళ్లీ ఆయన సొంతగూటిలో చేరడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీ కండువాను కప్పుకొంటారని తెలుస్తోంది. 2014 నాటి ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కాకినాడ లోక్సభ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి తోట నర్సింహం చేతిలో ఓడిపోయారు. అనంతరం వైసీపీలో ఎంతోకాలం పాటు కొనసాగలేకపోయారు. టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.
2019లో ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసినా.. ఓటమే ఎదురైంది. 25 వేలకుపైగా ఓట్ల తేడాతో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత చేతిలో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచీ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇదివరకే ఆయన పార్టీని ఫిరాయించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు జిల్లాలో విస్తృతంగా వినిపించాయి. అదే సమయంలో జిల్లాలో తనకు ప్రత్యర్థిగా ఉంటూ వస్తోన్న తోట కుటుంబం వైసీపీలో చేరడంతో ఇందులో జాప్యం చోటుచేసుకుందని చెబుతున్నారు.
అనంతరం ఆయన తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నారని, తెలుగుదేశం పార్టీని వీడటానికే నిర్ణయం తీసుకున్నారు. సొంతగూటికి చేరడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తన అనుచరులు, కొందరు టీడీపీ నేతలతో కలిసి ఆయన వైఎస్ఆర్పీలో చేరబోతున్నారనే వార్తలు జిల్లాలో వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలుసుకోవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని చెబుతున్నారు. భవిష్యత్తులో ఆయనను రాజ్యసభకకు పంపించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.