సిగరేట్ తాగిన ఆనం: పోలీసులకు టిడిపి నేత ఫిర్యాదు
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు గ్రామీణ శాసన సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి సిగరేట్ తాగడంపై తెలుగుదేశం పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లాలోని గుడిపల్లిపాడులో మూడోవిడత రచ్చబండ కార్యక్రమంలో ఆనం పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థుల పక్కన కూర్చొని ఎమ్మెల్యే ఆనం సిగరేట్ తాగారట. దీనిని చూసిన టిడిపి జిల్లా అధ్యక్షుడు ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చశారు. బహిరంగంగా సిగరేట్ కాలిస్తే చట్టబరంగా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.
కాగా, గతంలో అసెంబ్లీ పరిధిలో సిగరేట్ తాగిన ఆనంకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్లాస్ పీకారు. గత ఏడాది మార్చి నెలలో అసెంబ్లీ ప్రాంగణంలో ఆనం వివేకానంద సిగరేట్ తాగుతూ కిరణ్ కుమార్ రెడ్డికి కనిపించారు.
అక్కడే సిగరేట్ తాగడంపై ముఖ్యమంత్రి ఆనంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్లేసులో సిగరేట్ తాగటం ఏంటంటూ ఆనంకు క్లాస్ పీకారు. అసెంబ్లీలో దమ్ము కొట్టవద్దని సూచించారు. ఆనం అప్పుడు అసెంబ్లీలోని సిఎం చాంబర్ వద్ద సిగరేట్ తాగుతూ కిరణ్ కంట పడ్డారు.