ఉండవల్లి! డబ్బులిచ్చింది నిజమే, కానీ తప్పేంటి: నంద్యాల గెలుపుపై టిడిపి ట్విస్ట్
నంద్యాల ఉప ఎన్నికల్లో అవినీతితో టిడిపి గెలిచిందన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్పై గుంటూరు టిడిపి నేత గన్ని కృష్ణ నిప్పులు చెరిగారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు సరికాదన్నారు.
అమరావతి/గుంటూరు: నంద్యాల ఉప ఎన్నికల్లో అవినీతితో టిడిపి గెలిచిందన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్పై గుంటూరు టిడిపి నేత గన్ని కృష్ణ నిప్పులు చెరిగారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు సరికాదన్నారు.
డ్వాక్రా మహిళలకు రుణాలు అకౌంటులో వేయడం ఎన్నికల నియమావళి కిందకు రాదన్నారు. నంద్యాలలో డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.4,000 జమ చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అని అనడం సరి కాదని, ఎన్నికల కోణంలో చూడొద్దని ఆయన చెప్పారు.
నంద్యాలలో టిడిపి గెలుపు వెనుక: ఉండవల్లి షాకింగ్, బాబుకు షాక్, జగన్కు ఊరట
ఇదీ విషయం
పోలవరం ప్రాజెక్టు పనులు 2019 ఎన్నికలకు ముందే పూర్తవుతాయని కృష్ణ తెలిపారు. నంద్యాలలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీని ఎన్నికల దృష్టితోనే ఇచ్చారని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ కింద రూ.10 వేలు ఇస్తామని గతంలోనే ప్రకటించారన్నారు. ఇందులో భాగంగా రెండు విడతలుగా రూ.3వేల చొప్పున అందజేశారన్నారు.
అందులో తప్పేంటి?
మిగిలిన రూ.4 వేలు ఇవ్వడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముందని ఉండవల్లిని కృష్ణ ప్రశ్నించారు. ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపిని గెలిపించారన్నారు. వైసిపికి అనధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఉండవల్లి పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న సీఎంను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
ఉండవల్లి మాట మార్చారు
గతంలో తాను బతికుండగా పోలవరం పూర్తికాదని చెప్పిన ఉండవల్లి ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పనులు చూసి మాట మార్చారని కృష్ణ ఎద్దేవా చేశారు. పట్టిసీమపై చర్చకు సిద్ధపడిన ఉండవల్లి దాని ద్వారా లబ్ధి పొందుతున్న రైతుల వద్దకు వెళ్లి మాట్లాడాలన్నారు.
వైయస్ అవినీతిపై మాట్లాడరేం
టిడిపిపై అనేక విమర్శలు చేస్తున్న ఆయన వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఇప్పటికైన ప్రజలను తప్పుదోవ పట్టించే విమర్శలు మాని బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.