విశాఖలో 27 వేల రిజిస్ట్రేషన్లు ఇన్సైడర్ ట్రేడింగేనా ? సీబీఐ విచారణకు దేవినేని ఉమ డిమాండ్..
అమరావతి రాజధాని పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారంటూ ఆరోపణలు చేస్తున్న వైసీపీకి కౌంటర్ ఇచ్చేందుకు విపక్ష టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తమ హయాంలో అమరావతిలో రాజధాని కోసం చేపట్టిన భూసేకరణను ఇన్సైడర్ ట్రేడింగ్ గా ఆరోపిస్తున్న వైసీపీ ఇప్పుడు విశాఖలో జరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్లపై ఏం చెబుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
విశాఖలో గతేడాదిలో 55 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని, ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 27 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని, అవి కూడా కేవలం మూడు మండలాల్లోనే భారీగా జరుగుతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ఇవాళ ట్వీట్ చేశారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని వస్తుందని తెలిసి వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడుతున్నారని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. అమరావతి భూములపై ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో సీబీఐ విచారణ కోరుతున్న సీఎం జగన్.. ఇప్పుడు విశాఖలో రిజిస్ట్రేషన్లపైనా సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో 72 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని, రాజధాని కోసమే ఇవన్నీ జరుగుతున్నాయని, వీటిపై సీబీఐ విచారణ జరిపిస్తారా అంటూ దేవినేని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తద్వారా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో వైసీపీ చేస్తున్న ప్రచారానికి విశాఖ ఇన్సైడర్ ట్రేడింగ్తో కౌంటర్ ఇచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.