ఐటీ దాడుల వెనుక రహస్యమిదే..సీఎం కేసీఆర్కూ లింకులు: దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు
''రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులకు సంబందించి అధికారులు విడుదల చేసిన ప్రకటనను వైసీపీ నేతలు, జగన్ మీడియా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. గుర్తించిన రూ.2వేల కోట్ల అక్రమాస్తులు చంద్రబాబువేనని విమర్శిస్తున్నారు. కానీ, ఐటీ ప్రకటనలో పేర్కొన్న 'ప్రతిమా ఇన్ఫ్రా' పేరును మాత్రం చాలా కన్వీనియంట్గా మర్చిపోతున్నారు. ఎందుకంటే ఆ కంపెనీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమీప బంధువైన మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఆయన తమ్ముడికి చెందింది'' అంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు బాంబు పేల్చారు.
దమ్ముందా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపిన ఐటీ దాడుల వ్యవహారంపై దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఐటీ దాడులతో టీడీపీగానీ, చంద్రబాబుకుగానీ సంబంధం లేదని, దాడుల వెనుక అసలు రహస్యం వేరే ఉందని చెప్పారు. ‘‘ఒక మాజీ పీఏ శ్రీనివాస్ ఇంటి మీద దాడిని చంద్రబాబుకు లింకుపెట్టిట్టి అవాకులు చెవాకులు పేలుతున్న వైసీపీ నేతలు.. ప్రతిమా ఇన్ఫ్రాపై దాడి విషయంలో కేసీఆర్ను ప్రశ్నించే దమ్మూ, ధైర్యం ఉందా?''అని నిలదీశారు.
ఎవడ్రా ఆ పనులు చేస్తున్నది?
‘‘విజయసాయిరెడ్డితో కలిపి ఇవాళ ఉదయం నుంచి 20 మంది వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఎంతసేపూ చంద్రబాబును విమర్శించారేగానీ, ఐటీ ప్రకటనలో పేర్కొన్న ప్రతిమ ఇన్ ఫ్రా గురించి ఒక్కమాటా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ పేరెత్తితే కేసీఆర్ తాట తీస్తాడు కాబట్టి వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. కేసీఆర్ తో తత్సంబంధాలున్న మేగా ఇంజనీరింగ్ కంపెనీ నాడు పట్టిసీమ నిర్మిస్తే.. దాన్ని దొంగ కంపెనీ అని జగన్ విమర్శించాడు. ఇవాళ పోలవరం పనులు చేస్తున్నది ఎవడ్రా? మెగా కంపెనీ కాదా? దీనిపై వైసీపీ ఏనాడైనా మాట్లాడిందా?''అని దేవినేని ఉమ ఫైరయ్యారు.
లిస్టులో 8 మంది వైసీపీ నేతలు..
ఐటీ శాఖ తర్వాతి టార్గెట్ లో వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ముగ్గురు మంత్రులు, ఇద్దరు శాసనసభ్యుల పేర్లు కూడా ఉన్నాయని, వాళ్లపై దాడుల్ని ఆపించడానికే సీఎం జగన్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారని దేవినేని ఉమ తెలిపారు. ‘‘జగన్ తో పాటు చాలా మంది ఢిల్లీకి వెళ్లినా.. మోదీ గదిలోకి మాత్రం ముగ్గురు ఎంపీలనే తీసుకెళ్లాడు. అందరూ కలిసి ప్రధాని కాళ్లపైపడి శరణు వేడుకున్నారు. అసలు మోదీని జగన్ ఎందుకు కలిశాడో అధికారికంగా ప్రకటన చేస్తే ఇది నిజమో కాదో తేలిపోతుంది. ఐటీ దాడుల విషయంలో వైసీపీ నేతల తీరు దొంగే.. దొంగా.. దొంగా.. అని అరిచినట్లుందని ఉమ ఎద్దేవా చేశారు.
గోయల్ రిపోర్టుతో జగన్కు వణుకు
కియా మోటార్ కార్ల పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోయే విషయమై.. దావోస్ ఆర్థిక సదస్సులో పెద్ద చర్చ జరిగిందని దేవినేని చెప్పారు. ఇండియాలోని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలు మారిపోతాయా? అని కియా ప్రతినిధులతోపాటు ప్రపంచ ప్రఖ్యా కంపెనీల అధిపతులందరూ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను నిలదీశారని, దావోస్ నుంచి తిరిగొచ్చిన తర్వాత గోయల్ ఒక రిపోర్టు తయారుచేసి ప్రధాని మోదీకి పంపారని, ఆ రిపోర్టు చూశాకే మోదీ.. జగన్ ను పిలిపించారని ఉమ వివరించారు.
100 కార్లు గిఫ్టుగా అడిగారు..
అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్న కియా ఫ్యాక్టరీకి వెళ్లి వైసీపీ ఎంపీలు బెదిరింపులకు పాల్పడ్డారని, కనీసం 100 కార్లు గిఫ్టుగా ఇచ్చేయాలని, స్క్రాప్ కాంట్రాక్టులూ కేటాయించాలని ఒత్తిడి చేశారని, అందుకే ఆ సంస్థ తమిళనాడుకు వెళ్లాలని నిర్ణయించుకుందని దేవినేని తెలిపారు. కియా తరలింపులాగే రాజధాని, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లాంటి అంశాల్లోనూ ప్రభుత్వం పచ్చిగా అబద్ధాలు చెబుతోందని ఆయన ఆరోపించారు.
మాజీ పీఏ కూతురి పెళ్లి..
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిపై ఐటీ శాఖ దాడుల్లో పట్టుపడింది ఏమీ లేదని దేవినేని ఉమ చెప్పారు. పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఐటీకి కేవలం 2.14లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే దొరికాయని, వచ్చే నెలలలో తన కూతురి పెళ్లి కోసమే ఆయనా బంగారాన్ని కొనుగోలు చేశారని ఉమ వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబుపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు జీవితం తెరిచిన పుస్తకమని, ఆయనను ఎవరూ ఏమీ చేయలేరని దేవినేని ధీమా వ్యక్తం చేశారు.