పులివెందుల పులి.. డమ్మీ కాన్వాయ్లో వెళ్లడమేంటి? గిన్నిస్ బుక్లో సీఎం జగన్.. దేవినేని ఉమ ఫైర్
అమరావతి రైతుల ఉద్యమాన్ని చూసి ఏపీ సీఎం వైస్ జగన్, వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైందని, కాబట్టే అసెంబ్లీ సమావేశాలకు కనీవినీ ఎరుగని రీతిలో పోలీసు భద్రత ఏర్పాటుచేశారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. సోమవారంనాటి అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదంటూ టీడీపీ నేతలకు పోలీసులు సెక్షన్ 149 కింద నోటీసులిచ్చారని, అయినాసరే అసెంబ్లీని ముట్టడించి తీరుతామని ఆయన తెలిపారు.
పులివెందుల పులివా?
రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని రాష్ట్రమంతటా ఉద్యమాలు జరుగుతున్నా, సీఎం జగన్ మాత్రం మొండిగా, మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని, ఏకంగా 10 వేల మంది పోలీసుల్ని మోహరించి అసెంబ్లీ సమావేశాలు జరుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు. ‘‘పులివెందుల పులి అని చెప్పుకోడానికి జగన్ సిగ్గుపడాలి. రైతుల ఉద్యమానికి భయపడి.. క్యాంప్ ఆఫీస్ నుంచి సెక్రటేరియట్ వెళ్లడానికి ప్రతిరోజూ డమ్మీ కాన్వాయ్ లో ప్రయాణిస్తున్నాడు''అని విమర్శించారు.
ఇది కూడా రికార్డే..
దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఒక ముఖ్యమంత్రి డమ్మీ కాన్వాయ్ లో సెక్రటేరియట్ కు, అసెంబ్లీకి వెళ్లిన సందర్భాలు లేనేలేవని, ఈ విషయంలో జగన్ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కుతారని దేవినేని ఉమ సెటైర్ వేశారు. రైతుల నుంచి తప్పించుకుని అసెంబ్లీకి వెళ్లడానికి రాత్రిరాత్రే కొత్త రోడ్లు వేశారని, రాజధాని ప్రాంతంలో మెడికల్ షాపులు, పాల కేంద్రాల వంటి అత్యవసర సేవల్ని కూడా నిలిపేయించారని ఆయన ఆరోపించారు.
52వేల ఎకరాలు హాంఫట్..
అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలుకు యత్నించి విఫలమైన తర్వాతే సీఎం జగన్, వైసీపీ నేతలు వైజాగ్ రాజధానిని తెరపైకి తెచ్చారని ఉమ ఆరోపించారు. వైజాగ్ అధికారుల సహాకారంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సారధ్యంలో 52 వేల ఎకరాలకు ఎసరు పెట్టారని, ఆ భూముల్ని అధిక ధరకు అమ్ముకోడానికే రాజధానిని తరలిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ తో కుమ్మక్కు..
అమరావతిలో రియల్ ఎస్టేట్ నష్టపోయి, హైదరాబాద్ లో మళ్లీ బూమ్ వచ్చేలా తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి ఏపీ సీఎం జగన్ కుట్రలు పన్నారని ఉమ అన్నారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు సోమవారం అసెంబ్లీని ముట్టడించి తీరుతామని, పోలీసుల నోటీసులకు భయపడబోమని, ప్రతి ఒక్కరూ రోడ్లపైకొచ్చి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజెప్పాలని దేవినేని ఉమ పిలుపునిచ్చారు.