పాలన అంటే పక్క రాష్ట్రం నుంచి సలహాలు తీసుకోవడంకాదు.. ఏపీ సీఎం జగన్ పై దివ్యవాణి ఫైర్
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వాళ్లకు 21 రోజుల్లో శిక్షలు పడేలా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను, ఆమేరకు రూపొందించిన దిశ చట్టాన్ని సీఎం జగన్ పూర్తిగా మర్చిపోయారని టీడీపీ మహిళా నేత దివ్యవాణి విమర్శించారు. ఎన్నికలకు ముందు ఆడబిడ్డలందరినీ కాపాడుతానన్న వైసీపీ అధినేత.. ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం తన ఇద్దరు కూతుళ్ల గురించి మాత్రమే ప్రస్తావించడం దారుణమన్నారు.
మహిళా మంత్రులు టిక్ టాక్ లేనా?
సేవ్ అమరావతి ఉద్యమంలో మహిళల పట్ల పోలీసులు అనుసరించిన తీరుపైగానీ, రాష్ట్రం నలుమూలలా వెలుగుచూస్తోన్న అఘాయిత్యాలపైగానీ ప్రభుత్వానికి ఇంతైనా చలనం కలగడంలేదని దివ్యవాణి అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలు హాహాకారాలు పెడుతున్నా కనీసం వైసీపీ మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు కూడా స్పందించకపోవడం సరికాదని, మహిళా మంత్రులు టిక్ టాక్ వీడియోలకే పరిమితమైపోయినట్లు కనిపిస్తోందని దివ్యవాణి ఎద్దేవా చేశారు.
వీడియో గేమ్ లు ఆడటం కూడా పాలనేనా?
పరిపాలన అంటే పక్కరాష్ట్రానికి వెళ్లి అక్కడి ముఖ్యమంత్రులు, మంత్రుల నుంచి రోజుకో ఉపాయం తెచ్చుకుని అమలు చేసేది కాదన్న దివ్యవాణి.. పరోక్షంగా జగన్ కేసీఆర్ చర్చలపై సెటైర్లు వేశారు. సీఎంవోలో కూర్చొని వీడియో గేమ్ లు ఆడుతూ, గంట కొట్టగానే ఇంటికి వెళ్లిపోవడం పాలన అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదని విమర్శించారు.
లిస్టుతో సీఎంను కలుస్తా..
మహిళలపై పోలీసులే అఘాయిత్యాలకు పాల్పడుతున్న సందర్భం ఏపీలో చోటుచేసుకోవడం దారుణమని, ఆళ్లగడడలో జరిగిన చిన్న వివాదంలో భూమా అఖిలప్రియ దగ్గరున్న మహిళలతో ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడని, ఆ అవమానాన్ని తట్టుకోలేక మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందని దివ్యవాణి చెప్పుకొచ్చారు. నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. రేపిస్టుల జాబితాతో సీఎం జగన్ ను కలుస్తానని, నిందితులకు శిక్షలు పడేలా పోరాడుతానని దివ్యవాణి చెప్పారు.
ఫృథ్వీరాజ్ కు శిక్షలేదా?
మహిళల్ని వేధిస్తే 21 రోజుల్లోగా శిక్షలు పడేలా చేస్తామన్న సీఎం జగన్.. తన పార్టీకే చెందిన ఫృథ్వీరాజ్ ను మాత్రం వదిలేశారని, ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినంత మాత్రాన సరిపోదని, ఫృథ్వీపై చట్టపరంగానూ చర్యలు తీసుకోవాలని దివ్యవాణి డిమాండ్ చేశారు.