మమ్మల్ని కూడా కొంచె గుర్తించండి సార్...చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డంపడిన టీడీపీ నేత
కడప: తెలుగుదేశం పార్టీలో అనేక ఏళ్లగా సేవలందిస్తున్నా పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదని సీఎం చంద్రబాబునాయుడు వద్ద ఆ పార్టీ నేత చలపతి నాయుడు వాపోయారు.
నవ నిర్మాణ దీక్షలో పాల్గొనేందుకు కడపకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయిని కొండాయపల్లె ఎన్టీఆర్ విగ్రహం వద్ద టిడిపి నేత చలపతినాయుడు మరికొందరు కమ్మ సామాజిక వర్గీయులతో కలసి అడ్డుకున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాహనం దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మహిళలు చంద్రబాబుకు హారతి నిచ్చారు. అనంతరం చంద్రబాబుతో ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేయించారు. అనంతరం పార్టీలో తమకు ఎటువంటి గుర్తింపు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు తప్పకుండా గుర్తింపునిస్తాము. పార్టీ కోసం కస్టపడే వారిని ఎవరినీ విస్మరించేది లేదని చలపతినాయుడుతో అన్నారు.
ప్రస్తుతం నవనిర్మాణ దీక్షలు జరుగుతున్నందున అవి ముగిసిన అనంతరం తనను అమరావతిలో కలవాల్సిందిగా చలపతినాయుడుకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్నా ఆగ్రహించక పోవడం...పైగా తనను అమరావతిలో వచ్చి కలవాల్సిందిగా చంద్రబాబు సూచించడంతో టిడిపి నేత చలపతి నాయుడు సంతృప్తి చెందారు.
ఇటువంటి సంఘటనే ప్రొద్దుటూరులోని చెన్నమ రాజు పల్లెలోను చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రాకకోసం జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గానికికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చా రు. అందులో భాగంగా జమ్మలమడుగు టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నతోట శ్రీనివాసులు ముఖ్యమంత్రి చంద్రబాబువద్దకు వెళ్లినట్లు తెలిపారు. తాము పొన్నపురెడ్డి శివారెడ్డి, టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకోసం ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొని రామసుబ్బారెడ్డి వెంట నడుస్తున్నామని ముఖ్యమంత్రికి తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి గుర్తించి మండల అధ్యక్షుడిని భుజం తట్టి తమ్ముడు నేనున్నాను పార్టీకోసం కృషి చేయండి తన వంతు సహకారంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆయన భరోసా ఇచ్చారు.