చంద్రబాబును దులిపేసిన పురంధేశ్వరి, మనోభావాలు దెబ్బతీశారని టీడీపీ
అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం దివ్యాంగుల చర్యలు ఉందని బీజేపీ మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి వ్యాఖ్యానించడం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పోరేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వర రావు మండిపడ్డారు. దివ్యాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్లో అద్భుత అవకాశం: అవార్డులు, రికార్డ్లు.. ఎవరీ గల్లా జయదేవ్!
కాగా, శనివారం టీడీపీపై, చంద్రబాబుపై పురంధేశ్వరి నిప్పులు చెరిగారు. బీజేపీతో టీడీపీకి లోపాయికారి ఒప్పందమని వైసీపీ అంటోందని, వైసీపీతో లోపాయికారి ఒప్పందమని టీడీపీ అంటోందని, అసలు మొదట మీరు మీరు తేల్చుకోండని పురంధేశ్వరి నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై టీడీపీ అనేకసార్లు యూటర్న్ తీసుకుందని ధ్వజమెత్తారు.
చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారు
ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే బెట్టర్ అని టీడీపీ చెప్పిందని పురంధేశ్వరి గుర్తు చేశారు. వారే మాట మార్చి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారన్నారు. విభజనకు సానుకూలమని ఆ రోజు చెప్పారని, కానీ బిల్లు పాసయ్యే సమయంలో ఏం కావాలో చెప్పలేదన్నారు. కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి కూడా అడగలేదన్నారు. కానీ అప్పుడు పోరాడింది ఒక బీజేపీ మాత్రమే అన్నారు. చంద్రబాబు పాలనతో ఏపీ ప్రజలు విసిగిపోయారన్నారు.
చంద్రబాబు అడ్డు కాదా చెప్పాలని పురంధేశ్వరి నిలదీత
అవిశ్వాసం తీర్మానం సమయంలో టీడీపీ అన్నీ అబద్దాలే చెప్పిందని పురంధేశ్వరి అన్నారు. దుగరాజుపట్నం పోర్టు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీ జాప్యానికి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ఈ విషయంలో తాము ఎలాంటి రాజకీయాలు చేయట్లేదని, విశాఖకు రైల్వే జోన్ కచ్చితంగా వస్తుందన్నారు.
పురందేశ్వరి
కేంద్రాన్ని ప్రజాదర్బారులో దోషిగా నిలబెట్టాలని టీడీపీ పదేపదే ప్రయత్నిస్తోందని, అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో అసలు దోషులెవరో ఏపీ ప్రజలు గుర్తించారని పురందేశ్వరి అన్నారు. కాంగ్రెస్తో కుమ్మకై రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించడం సబబు కాదని, చిన్న రాష్ట్రాలతో పాలనా సౌలభ్యముంటుందని మాత్రమే బీజేపీ నమ్మిందన్నారు. అశాస్త్రీయంగా జరిగిన విభజనలో చంద్రబాబు కూడా భాగస్వామి అన్నారు. కేంద్రం అవినీతిని అంటగట్టాలనే తహతహలో రాహుల్ గాంధీ పార్లమెంటులో అసత్యాలు మాట్లాడారన్నారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుందని పార్లమెంటు సాక్షిగా నిరూపితమైందని మరో బీజేపీ నేత సుదీష్ రాంభోట్ల అన్నారు.
జగన్, పవన్ కళ్యాణ్ల సంబరం
లోకసభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ చదివిన స్క్రిప్ట్ జగన్, పవన్లు రాసిచ్చిందేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఇన్నాళ్లు బీజేపీ స్క్రిప్ట్ను వారిద్దరు చదువుతున్నారని చెప్పిన టీడీపీ నేతలు, ఇప్పుడు మరో రూట్లో వచ్చారు. జగన్, పవన్ల విజ్ఞప్తులనే లోకసభలో మోడీ చదివారన్నారు. అవిశ్వాస తీర్మానంతో ఎవరు ఏ పార్టీకి అండగా ఉన్నారో ప్రజలకు అర్థమైందని, వైసీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు ఒకటే అన్నారు. ఆ మూడు పార్టీలు ఒకే భవనంలో కార్యాలయం పెట్టుకుంటే వారికి డబ్బు ఆదా అవుతుందన్నారు. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం వీగిపోయిందని జగన్, పవన్ కళ్యాణ్లు సంబరపడ్డారని, పవన్ ఇక రాజకీయాలకు పనికి రాడని బుద్ధా వెంకన్న అన్నారు.