జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్.. ‘ప్రబోధానంద’కేసులో ఏక్షణమైనా అరెస్టు.. భయంతో విలవిల..
ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మెడకు మరో ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది. ఇప్పటికే ఆయనకు చెందిన ట్రావెల్స్, మైనింగ్ కంపెనీల అనుమతులను రద్దు చేసిన ప్రభుత్వం.. రెండేళ్ల కిందటి కేసును కూడా తిరగదోడుతున్నది. పరిస్థితి అరెస్టుదాకా రావొచ్చని స్వయంగా జేసీనే వెల్లడంచడం, తాను భయంతో వణికిపోతున్నానని కూడా చెప్పడం గమనార్హం.
ఏమిటా కేసు?
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రఖ్యాత ప్రబోధానంద ఆశ్రమంపై 2018 సెప్టెంబర్ లో జేసీ సోదరుల వర్గీయులు దాడి చేశారు. నాటి ఘటనలో సుమారు వెయ్యిమందికిపైగా గాయపడగా, 40 వాహనాలు దగ్ధమయ్యాయి. ఆ సందర్భంలోనే పోలీసులతోనూ జేసీ గొడవపెట్టుకోవడం, అప్పటి సీఐ గోరంట్ల మాధవ్ మీసాలు మెలేస్తూ జేసీకి సవాలు విసరడం, ఆ తర్వాత ఎన్నికల్లో జేసీ ఓడిపోవడం, సీఐ మాధవ్ ఎంపీగా గెలవడం తదితర పరిణామాలు జరిగాయి. ఆశ్రమానికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు జేసీ వర్గీయులు దాడికి దిగారని ఆథ్యాత్మిక గురువు ప్రబోధానంద ఆరోపించారు. ఆశ్రమంపై దాడికి సంబంధించి కేసులు నమోదయ్యాయి.
జేసీనే సూత్రధారి?
రెండేళ్ల కిందట ప్రబోధానంద ఆశ్రమంపై దాడి కేసును ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వేగంగా తిరగదోడుతున్నది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కేసులో ప్రధాన నిందితులైన జేసీ సోదరుల్ని కూడా అదుపులోకి తీసుకోవడం ఖాయమనే చర్చ జరుగుతున్నది. ఈలోపే దివాకర్ రెడ్డే స్వయంగా అరెస్టు భయాలు వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.
వైసీపికి తప్ప..
ప్రబోధానంద వ్యవహారంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలపైనా జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచినట్లు నిరూపణ అయితే ఆ అభ్యర్థి గెలిచానా పదవి నుంచి తొలగించేలా జగన్ సర్కారు చేసిన చట్టంతో రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. సదరు చట్టం వైసీపీకి తప్ప మిగతా అందరికీ వర్తిస్తుందని ఎద్దేవా చేశారు.
Recommended Video
నేను భయపడ్డా..
‘‘కొత్త చట్టాలు తెచ్చినందుకు జనం జగన్ కు జేజేలు కొడుతున్నారు. అయితే ఆ చట్టం అందరికీ వర్తిస్తేనే మంచిది. జగన్ దూకుడుకు నేను భయపడ్డాను కాబట్టే స్థానిక ఎన్నికల్లో మా వర్గం వాళ్లను పోటీకి దింపట్లేదు. నిజానికి రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు వేరు.. ఓట్లు వేసేసరికి పరిస్థితులు వేరు.. రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఒక్కటైనా వైసీపీని ఓడించలేవు. స్థానిక ఎన్నికల్లో మావాడే గెలుస్తాడు.. అందులో తిరుగులేదు''అని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.