స్ధానిక పోరుపై జేసీ షాకింగ్ కామెంట్స్-నిమ్మగడ్డ ఉండగా నో ఛాన్స్-విపక్షం పోటీ చేయకుంటే బెటర్..
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. మార్చిలో కరోనా కారణంగా వాయిదా వేసిన ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాల్సిందేనని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ భావిస్తుండగా.. ఎలా జరుపుతారో చూస్తామంటూ వైసీపీ సర్కారు సవాళ్లు విసురుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్రెడ్డి ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ ఎన్నికలు జరిగేనా అన్నట్లుగా ఉన్న ఆయన వ్యాఖ్యలే షాకింగ్ అంటే వీటికి విపక్షాలు దూరంగా ఉంటే బెటరంటూ మరో షాకింగ్ సలహా కూడా ఇచ్చారు.
స్ధానిక పోరుపై జేసీ కామెంట్స్
ఏపీలో స్ధానిక ఎన్నికలు నిర్వహించే పరిస్దితులు లేవంటూ నిన్న వ్యాఖ్యానించిన టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్రెడ్డి ఇవాళ మరో బాంబు పేల్చారు. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఆసక్తి లేదని బహిరంగంగానే తెలుస్తున్నా.. ప్రభుత్వ ఉద్దేశమిదేనంటూ జేసీ మరోసారి వైసీపీ సర్కార్ను టార్గెట్ చేశారు. అంతే కాదు విపక్షాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జేసీ కామెంట్స్ ఇప్పుడు స్ధానిక ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలతో పాటు అభ్యర్ధుల్లోనూ కలకలం రేపుతున్నాయి. గతంలోనూ పలుమార్లు ముక్కుసూటిగా మాట్లాడతారని పేరున్న జేసీ చేసిన వ్యాఖ్యలు ఓ రకంగా ఏపీలో నెలకొన్న వాస్తవ పరిస్దితులను స్పష్టం చేస్తున్నాయి.
నిమ్మగడ్డ ఉండగా నో ఎన్నికలు..
ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలు నెరవేరబోవనే అర్ధం వచ్చేలా జేసీ దివాకర్రెడ్డి తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్గా ఉండగా స్ధానిక ఎన్నికలు జరగబోవంటూ జేసీ కుండబద్దలు కొట్టేశారు. వచ్చే ఏడాది మార్చిలో ఆయన రిటైర్ అవుతారు. దీంతో మార్చి తర్వాతే స్ధానిక ఎన్నికలు ఉంటాయన్న అర్ధం వచ్చేలా జేసీ వ్యాఖ్యలున్నాయి. జ్వరం, క్యాంపుల పేరుతో అధికారులు ఎన్నికల కమిషన్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లకు అధికారులు హాజరు కారని జేసీ పేర్కొన్నారు. ఎన్నికలు ఆలస్యం చేయడం వెనుక ఏపీ సర్కార్ ఎత్తుగడ ఉందని జేసీ వ్యాఖ్యానించారు. తద్వారా నిమ్మగడ్డ హయాంలో ఏపీ సర్కార్ ఎన్నికలకు ఇష్టం పడటం లేదనే విషయాన్ని జేసీ స్పష్టంగా చెప్పారు.
మళ్లీ కనగరాజ్ సాయంతో ఏకగ్రీవాలే..
ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా వేశారన్న కారణంతో వైసీపీ సర్కారు అత్యవసర ఆర్డినెన్స్ తెచ్చి ఆయన్ను తప్పించింది. నిమ్మగడ్డ స్దానంలో తమిళనాడు నుంచి మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ను నియమించింది. ఆయన కరోనా సమయంలో హడావిడిగా ఏపీకి అంబులెన్స్లో వచ్చి మరీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో ఆయన తప్పుకున్నారు. నిమ్మగడ్డ రిటైర్ అయ్యాక ఆయన స్ధానంలో మళ్లీ కనగరాజ్ను తీసుకొచ్చి ఎన్నికలన ఏకగ్రీవం చేసేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోందని జేసీ అన్నారు.
ఎన్నికల్లో విపక్షాలు పోటీ చేయకుంటేనే బెటర్
స్ధానిక సంస్దల ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు వైసీపీ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోందని టీడీపీ నేత జేసీ దివాకర్రెడ్డి స్పష్టం చేశారు.
గతంలో నిమ్మగడ్డ హయాంలోనూ అత్యధిక ఏకగ్రీవాలు చేసేందుకు ప్రయత్నించారని, మరోసారి అదే ఫార్ములా అనుసరించే అవకాశం ఉందని జేసీ తెలిపారు. ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తి విపక్షాలకు లేదని, అందుకే ఆయా పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉంటేనే మేలని జేసీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అలా కాదని పోటీ చేసినా ఏదో కేసు పెట్టి లోపలేస్తారంటూ జేసీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మరోసారి కనకరాజ్ సాయంతో గతంలో జరిగిన ఏకగ్రీవాలు కరెక్ట్ అని చెప్పించే ప్రయత్నం చేస్తోందన్నారు.