టిడిపి ఎంపి సీఎం రమేష్ పై మరోసారి మండిపడ్డ సొంతపార్టీ నేత:ఆయన ఆటలు ఇక సాగనివ్వమని హెచ్చరిక
కడప:రాజ్యసభ ఎంపి సీఎం రమేష్పై ప్రొద్దుటూరు నియోజకవర్గం టిడిపి ఇన్ ఛార్జ్ నంద్యాల వరద రాజుల రెడ్డి మరోసారి తారాస్థాయిలో ధ్వజమెత్తారు. సిఎం రమేష్ పెత్తనాన్ని, ఆటలను తమ నియోజక వర్గంలో ఇక సాగనివ్వబోమని స్పష్టం చేశారు.
ప్రొద్దుటూరులో అధికారులతో సిఎం రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించడంపై వరదరాజులరెడ్డి మండిపడ్డారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిధిలో సిఎం రమేష్ జోక్యాన్ని నివారించేందుకు ఎంతదూరమైనా వెళతామని వరదరాజులరెడ్డి తీవ్ర హెచ్చరిక చేశారు. శనివారం రాత్రి త్రి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వరదరాజులరెడ్డి ఈ హెచ్చరిక చేశారు.
గతంలో రాజ్యసభ సభ్యులు ఎప్పుడూ ప్రొద్టుటూరు మునిసిపాలిటీలో అధికారులతో సమీక్షను జరిపిన సందర్భాలు లేవని వరదరాజుల రెడ్డి గుర్తుచేశారు. సమీక్షా సమావేశానికి మునిసిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డిని, పార్టీ ఇన్చార్జినైన తననే కాకుండా చివరకు తన వర్గం కౌన్సిలర్లను కూడా పిలవకుండా సిఎం రమేష్ సమీక్షలు జరపడం సహించబోమని చెప్పారు.
వైసీపీ నుంచి వచ్చిన కౌన్సిలర్లతో పాటు టిడిపి నుంచి గెల్చిన కొందరు కౌన్సిలర్లును సీఎం రమేష్ కొన్నారని వరదరాజులరెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. అయితే ఇది బలం కాదని వాపు మాత్రమేనన్నారు. సీఎం రమేష్ జరిపిన సమీక్షపై తాము సోమవారం మునిసిపల్ చైర్మన్తో కలిసి మళ్లీ సమీక్ష జరుపుతామని వరదరాజుల రెడ్డి స్పష్టం చేశారు.
సిఎం రమేష్ స్థాయి గ్రామానికి ఎక్కువ మండలానికి తక్కువని వరదరాజుల రెడ్డి తేల్చేశారు. అసలు సిఎం రమేష్ ఏ ఎన్నికల్లోనూ ప్రజలతో నేరుగా ఓట్లు వేయించుకుని గెలవలేదని చెప్పారు. అలాంటి వ్యక్తి పెత్తనం ఇక ప్రొద్దుటూరులో చెల్లదని...ఈ విషయంలో వెనక్కితగ్గేదే లేదన్నారు.