జగన్లాంటోళ్లను చాలామందిని చూశాం:అయ్యన్నపై ఏడాదిలో ఏడు: మచ్చలేని జీవితం: నారా లోకేష్
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదు కావడం పట్ల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ తప్పు పట్టారు. అయ్యన్న పాత్రుడిపై కక్ష సాధించడంలో భాగంగానే ఈ కేసు అక్రమంగా బనాయించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అయ్యన్న పాత్రుడిని టార్గెట్గా చేశారని, ఏకంగా ఏడు కేసులు పెట్టారని విమర్శించారు.
మున్సిపల్ అధికారిణిపై బూతులతో చెలరేగిన టీడీపీ మాజీమంత్రి: నిర్భయ చట్టం కింద కేసు
నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిపై బూతులతో విరుచుకుని పడిన కేసులో అయ్యన్న పాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. కృష్ణవేణిని ఉద్దేశించి.. బట్టలు ఊడదీసే పరిస్థితి తీసుకుని రావొద్దని అయ్యన్న హెచ్చరించారు. కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ బహిరంగ సభలో అందరి ముందూ తనను కించపరిచేలా అయ్యన్న పాత్రుడు మాట్లాడారని ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది అక్రమ కేసు అని నారా లోకేష్ ఆరోపించారు. ఉద్దేశపూరకంగానే కేసు నమోదు చేయించిందని విమర్శించారు. రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయిన అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు చేయడం దురుద్దేశంతో కూడుకున్న చర్యగా ఆయన అభివర్ణించారు. అయ్యన్న పాత్రుడు ఏజెన్సీ ప్రాంతానికి, గిరిజనులకు ఎంతో సేవ చేసిన సీనియర్ నాయకుడని అన్నారు. ఆయనపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
Recommended Video
అయ్యన్న పాత్రుడిది 37 సంవత్సరాల మచ్చలేని రాజకీయ జీవితం అని, 10 శాఖలకు మంత్రిగా పని చేసిన సుదీర్ఘ అనుభవం ఆయన సొంతమని నారా లోకేష్ చెప్పారు. వైఎస్ జగన్తో కలిపి పది మంది ముఖ్యమంత్రులను చూశారని అన్నారు. అలాంటి నేతపై ఏడాదిలో అట్రాసిటీ నుంచి నిర్భయ వరకూ ఏడు కేసులను జగన్ ప్రభుత్వం నమోదు చేసిందని విమర్శించారు. జగన్ పాలన ఎలా ఉందో చెప్పడానికి అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నంలో తాజాగా నమోదైన కేసు చూస్తేనే చాలు అని అన్నారు. జగన్ లాంటి కుర్రకుంకలను అయ్యన్న చాలా మందినే చూసి ఉంటారని చెప్పారు.