మ్యాటర్ వీక్: జగన్ రెడ్డి బుల్లెట్ లేని గన్: బొత్స ఏం పీకాడు: మున్సిపల్ మేనిఫెస్టో: నారా లోకేష్
అమరావతి: వచ్చనెల నిర్వహించబోయే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. మేనిఫెస్టోను విడుదల చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ఈ మేనిఫెస్టోను కొద్దిసేపటి కిందటే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్బ్యురో సభ్యుడు వర్ల రామయ్య, మాజీమంత్రి నక్కా ఆనంద్బాబు, సీనియర్ నాయకురాలు పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు ఇందులో పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో తాము అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి పనులను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు.
నీతా అంబానీ భాబీ..ఇది ట్రైలర్ మాత్రమే: కారులో ముంబై ఇండియన్స్ బ్యాగ్..బెదిరింపు లేఖ
జగన్ రెడ్డి ఏం పీకాడు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన.. పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ అన్నట్లుగా సాగుతోందని నారా లోకేష్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలో ఆయన ఏం పీకాడని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో తాము మద్దతిచ్చిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేశారని, అయినప్పటికీ.. ప్రజలు తమకు భారీ విజయాన్ని అప్పగించారని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కడే గానీ అభివృద్ధి కనిపించట్లేదని విమర్శించారు. పార్కులు, భూగర్భ డ్రైనేజీలు, పక్కా ఇళ్లను నిర్మించలేకపోతోందని ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో భారీగా పన్నులను పెంచేశారని ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పైనా నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. ఒక్క టిట్కో ఇంటిని కూడా కట్టలేకపోయారని, ఏం పీకాడని ప్రశ్నించారు.
బులెట్ లేని గన్.. జగన్
ఒక్క ఛాన్స్ అని అభ్యర్థించి మరీ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అన్ని రకాలుగా ప్రజలను వంచించారని నారా లోకేష్ విమర్శించారు. జగన్ అంటే గన్ లాంటోడని వైసీపీ నేతలు ప్రచారం చేస్తోన్నారని, నిజానికి ఆయన బులెట్ లేని గన్ అని ఎద్దేవా చేశారు. మహిళలపై యథేచ్ఛగా దాడులు పెరిగిపోతోంటే ప్రభుత్వం స్పందించకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు. పన్నులు, ఇసుక ధరలు.. చివరికి వంటగ్యాస్ సిలిండర్ రేటును కూడా జగన్ సర్కారే పెంచిందని చెప్పారు. కుడి చేతి నుంచి రూ.10 ఇచ్చి.. మరో చేత్తో రూ.100 లాక్కుంటున్నారని ఆరోపించారు.
10 వాగ్దానాలతో ఎన్నికలకు..
టీడీపీ అధికారంలోకి వచ్చిన మున్సిపాలిటీల్లో అమలు చేయదలిచిన హామీల గురించి నారా లోకేష్ వివరించారు. మున్సిపాలిటీల్లో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని అన్నారు. పాత పన్నులను మాఫీ చేయడంతో పాటు ఇకపై సగమే వసూలు చేస్తామని చెప్పారు. పరిశుద్ధమైన నీటిని మున్సిపాలిటీల్లో సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. పరిశుభ్ర వాతావరణాన్ని ప్రజలకు కల్పిస్తామని ఆయన అన్నారు. నిరుద్యోగ యువత కోసం ప్రతి ఆరునెలలకోసారి జాబ్ మేళాను నిర్వహిస్తామని నారా లోకేష్ చెప్పారు. పట్టణాల్లో గుంతలు లేని రోడ్లు, పార్కులు, ఓపెన్ జిమ్, ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.
అత్యాధునిక ఆటోస్టాండ్లు..
మున్సిపాలిటీల్లో అత్యాధునికమైన ఆటో స్టాండ్లను నెలకొల్పుతామని నారా లోకేష్ చెప్పారు. మెప్మా గ్రూపుల కోసం సున్నా వడ్డీతో బ్యాంకుల రుణాలను అందిస్తామని అన్నారు. మెప్మా బజార్లను నెలకొల్పుతామని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు టిట్కో గృహాలను శాశ్వతంగా నిర్మించి ఇస్తామని, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను 21 వేల రూపాయలకు పెంచుతామని అన్నారు. ఉచిత మంచినీటి కనెక్షన్ ఇవ్వడంతో పాటు, బకాయిలను రద్దు చేస్తామని చెప్పారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో తమ పార్టీకి ఓటుబ్యాంకు ఉందని అన్నారు.