డీజీపీ సవాంగ్పై జగన్ మార్క్ భోగిపళ్లు: నారా లోకేష్ కొత్త వివాదం..కొడాలి నాని పేరు: సుమోటోగా
అమరావతి: రాష్ట్రంలో ఇదివరకు చోటు చేసుకున్న దేవాలయాలపై దాడులు, విగ్రహాలను ధ్వంసం చేసిన ఉదంతంపై రాజుకున్న రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. ఈ ఘటనలను మరికొంతకాలం పాటు కొనసాగించడానికే తెలుగుదేశం ప్రాధాన్యత ఇస్తోందనే విషయం.. తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ చేసిన ప్రకటనలను తోసిపుచ్చిన నారా లోకేష్.. ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానినీ లాగారు.
కాస్సేపట్లో వ్యాక్సినేషన్: వైఎస్ జగన్ షెడ్యూల్ ఇదే: వారంలో ఎన్ని రోజులు వ్యాక్సిన్?
ఆలయాల్లో దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనల్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నట్టు గుర్తించామని, ఆయా కేసుల్లో 15 మందిని అరెస్ట్ చేశామని గౌతమ్ సవాంగ్ చేసిన ప్రకటనలను నారా లోకేష్ తప్పు పట్టారు. ఆయా ఘటనల వెనుక రాజకీయ కుట్రకోణం దాగి ఉందనే దిశగా దర్యాప్తు చేస్తున్నామంటూ స్పష్టం చేయడం పట్ల అభ్యంతర వ్యక్తం చేశారు. ఇదివరకు ఆలయాల్లో చోటు చేసుకున్న ఘటనల వెనుక దొంగలు, మానసిక స్థిరత్వం లేని వాళ్లు ఉన్నారని తేల్చిన పోలీసులు.. ఇప్పుడు తాజాగా మాట మార్చుతున్నారని ఆరోపించారు. రాజకీయ కుట్రకోణం అనే మాటను ఎందుకు వినిపిస్తున్నారని ప్రశ్నించారు.
రాత్రికి తాడేపల్లి కొంపలో వైఎస్ జగన్ మార్క్ భోగి పళ్లేమైనా డీజీపీకి పోశారా అని నిలదీశారు. ఇదివరకు ఓంకార క్షేత్రంలో అర్చకులను చితక్కొట్టిన ఘటనలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతాపరెడ్డికి ప్రమేయం ఉందని ఆయన పేరును ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఆంజనేయుడి చేయి విరిగితే రక్తం వస్తుందా?, రాముడి విగ్రహం తల తెగితే ప్రాణం పోతుందా? అని హిందుత్వంపైనే దాడికి దిగిన మంత్రి కొడాలి నానిపై కేసు ఎందుకు పెట్టలేదని అన్నారు.
రాష్ట్రంలో హిందుత్వం మనుగడనే ప్రశ్నించేలా ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంటే నిందితులను పట్టకోవడం పోలీసుల చేత కావట్లేదని ఆరోపించారు. చేతకాక, చేవచచ్చిన పోలీసులపై ముందు కేసుపెట్టాలని నారా లోకేష్ అన్నారు. తప్పుడు సమాచారంతో ప్రజలను డీజీపీ గౌతమ్ సవాంగ్ తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఆయనపై న్యాయస్థానాలు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. అధికార పార్టీ నేతలను పోలీసులు ఉద్దేశపూరకంగా వదిలేస్తున్నారని మండిపడ్డారు.