జగన్ ‘దేవుడి స్క్రిప్ట్’రివర్సైంది.. వైసీపీకి ఫిదా అయ్యానన్న నారా లోకేశ్..ఎంపీలకు టెంపుల్టన్ పాఠాలు
మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు మెడకు కేసుల ఉచ్చు బిగించేలా ఢిల్లీ నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేసిన వైసీపీ.. తన ఎంపీల ద్వారా పదే పదే ఆరోపణల్ని ప్రస్తావిస్తూ, సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తోంది. లోక్ సభలో వైసీపీ పక్షనేత పీవీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీతో చంద్రబాబుకు అక్రమ లావాదేవీలున్నాయని ఆరోపించారు. ఆ వీడియోలు వైరల్ కావడం, తమపై ఆరోపణల్ని సదరు కంపెనీ సైతం ఖండించడం చకచకా జరిగాయి. ఇప్పుడదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ లో వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్ చెప్పే దేవుడి స్క్రిప్టుపైనా సెటైర్లు వేశారు.
లోకేశ్ ఎద్దేవా
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. టెంపుల్టన్ పేరును టెంపుల్ టౌన్ గా పలకడాన్ని లోకేశ్ ఎద్దేవా చేశారు. ‘‘మాస్టారూ.. అది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌనో, టెంపుల్ విలేజో కాదు. ఆ కంపెనీ పేరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. కనీసం కంపెనీ పేరు కూడా తెలుసుకోకుండా దానితో చంద్రబాబుకు సంబంధాలున్నాయని పార్లమెంటులో చెప్పడం హాస్యాస్పదం. లోక్ సభలో వైసీపీ చేసిన స్టాండప్ కామెడీకి నేను ఫిదా అయిపోయా''అని సెటైర్ వేశారు.
కంపెనీలన్నీ బైబై ఏపీ అంటున్నాయ్..
వైసీపీ ఎంపీలు చెబుతున్నట్లు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ చంద్రబాబు బినామీనే అయితే.. అందులో సీఎం జగన్ షేర్లు ఎందుకు కొన్నారో చెప్పాలని లోకేశ్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర యువతకు మేలు చేసే కంపెనీలు ఏపీకి రావడం వైసీపీకి మొదటి నుంచీ ఇష్టం లేదని, అందుకే తప్పుడు ఆరోపణలతో టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక కంపెనీలన్నీ ‘బైబై ఏపీ'అంటూ పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు.
ఇది కూడా దేవుడి స్క్రిప్టే..
ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో 58 శాతం పనులు పూర్తయ్యాయని వైసీపీ ప్రభుత్వం చెప్పడాన్ని టీడీపీ నేత లోకేశ్ స్వాగతించారు. ‘‘సీఎం జగన్ పదే పదే చెప్పే దేవుడి స్క్రిప్ట్ ఎంత గొప్పదంటే.. ఇప్పుడు జగన్ నోటివెంట కూడా నిజాలు వస్తున్నాయి. సీఎం సీటు కోసం ఆయన చెప్పని అబద్ధమంటూ లేదు. కనీసం కోర్టుకైనా ఇప్పుడు నిజం చెప్పారు''అని పేర్కొన్నారు.
అమరావతి కూడా అంతేగా..
సీఎం జగన్ పోలవరం విషయంలో ప్రజలకు అబద్ధాలు చెప్పినట్లే అమరావతిలోనూ అదే పంథాను అనుసరిస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. అమరావతిని గ్రాఫిక్స్ మాయాజాలమన్న నోటితోనే.. అక్కడ రూ.6 వేల కోట్లతో పనులు జరిగాయని జగనే ఒప్పుకునే పరిస్థితి నెలకొందని, ఆలస్యంగానైనా చంద్రబాబు చేసిన అభివృద్ధిని జగన్ గుర్తించకతప్పదని లోకేశ్ అన్నారు.