అచ్చెన్నకు రూ.50 కోట్లు ఆఫర్: నన్నూ జైలుకు: మీ తాతను చూశా..మీ నాన్నను చూశా: నారా లోకేష్
అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. 16 నెలల పాటు జైలులో కూర్చుని చిప్పకూడు తిన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ చిప్పకూడు తిన్నందుకు..ఆంధ్రులు అందరినీ జైలుకు పంపించాలని, అదే చిప్పకూడును తినిపించడానికి కంకణం కట్టకున్నారని ఆరోపించారు. అకారణంగా తమ పార్టీ నాయకులను జైలుపాలు చేస్తున్నారని మండిపడ్డారు.
జేసీ దివాకర్కు పరామర్శ
సోమవారం మధ్యాహ్నం నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రికి బయలుదేరి వెళ్లారు. దివాకర్ ట్రావెల్స్లో వాహనాల ఫోర్జరీకి పాల్పడిన కేసులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి కుటుంబానికి సంఘీభావాన్ని తెలియజేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరుడు, పార్టీ లోక్సభ మాజీ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిలతో సమావేశం అయ్యారు. అరెస్టుకు గల కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
నువ్వు చిప్పకూడు తింటే..
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 16 నెలల పాటు వైఎస్ జగన్ జైలు జీవితాన్ని గడిపారని, చంచల్గూడ జైలులో చిప్పకూడు తిన్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రులు అందరితోనూ చిప్పకూడు తినిపించాలని టార్గెట్గా పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. ఆంధ్రుల ముందు వైఎస్ జగన్ ఆటలు చెల్లవని హెచ్చరించారు. కుట్ర రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలను తాము అడ్డుకుంటామని అన్నారు.
అన్నీ రాసిపెట్టుకున్నా.. వడ్డీతో సహా చెల్లిస్తా
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చేపట్టిన ప్రజా వ్యతిరేక చర్యలు, తీసుకున్న నిర్ణయాలు, ఆంధ్రులపై కొనసాగించిన దాడులన్నింటినీ తాను రాసి పెట్టుకున్నానని నారా లోకేష్ అన్నారు. వాటన్నింటినీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అనంతపురంలో తమ పార్టీ కార్యకర్త ఇంటి ముందు గోడ కట్టారని, ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారనే కారణంతో బడుగు, బలహీన వర్గాల వారిని ఊరి నుంచి వెలేశారని ఆరోపించారు.
మరిచిపోతామనుకుంటే పొరపాటు..
తెలుగుదేశం పార్టీ ఇక అధికారంలోకి రాదని అనుకోవద్దని నారా లోకేష్ హెచ్చరించారు. వైసీపీ నాయకులు సాగించిన దౌర్జన్యాలను తాము మర్చిపోతామని వైఎస్ జగన్ అనుకుంటే పొరపడినట్టేనని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు కొనసాగిస్తూ వెళ్తే.. చూస్తూ ఊరుకోబోమని, ఏ ఒక్కర్నీ వదిలి పెట్టబోమని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా వైసీపీ నాయకులకు తిరిగి ఇచ్చేస్తామని అన్నారు.
వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని, త్వరలో తిరుగుబాటు రాబోతోందని నారా లోకేష్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వైఎస్ జగన్ దాడులు చేశారని, ఇక ప్రజలపైనా పడతారని విమర్శించారు. ఇప్పటికే బడుగు, బలహీన వర్గాలపై దాడులు చేస్తున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలపైన కేసులు పెడుతున్నారని, వాటన్నింటినీ తాను శాసన మండలిలో బయటపెడతానని చెప్పారు.
మాట వినకపోతే అందర్నీ జైలుకు
వైఎస్ఆర్సీపీ నాయకులు గజదొంగలుగా తయారయ్యారని నారా లోకేష్ ఆరోపించారు. తమ మాట వినని వారిని అరెస్టులో భయపెడుతున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో తాము హాయిగా ఉన్నామని ఏ ఒక్కరు అనుకోవట్లేదని చెప్పారు. వైసీపీ నేతల దాడులు, దారుణాలు మరింత పెరుగుతాయని చెప్పారు. ప్రజల్లో తిరుగుబాటు రావడం తథ్యమని, అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగలేరని నారా లోకేష్ జోస్యం చెప్పారు.
అచ్చెన్నకు రూ.50 కోట్లు ఆఫర్
అచ్చెన్నాయుడి కుటుంబంలో ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని, వారందరూ తమ పార్టీలో చేరాలని వైఎస్ జగన్ ఒత్తిడి తెచ్చారని నారా లోకేష్ ఆరోపించారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీలపై పార్టీ ఫిరాయింపు ఒత్తిళ్లు తెచ్చారని అన్నారు. అందరూ ఒకేసారి వస్తే తాను చూసుకుంటానని ప్రలోభాలకు గురి చేశారని చెప్పారు. వైఎస్ రాజారెడ్డిని, వైఎస్ రాజశేఖర్ రెడ్డినే తాము లెక్క చేయలేదని, ఇక జగన్ను పట్టించుకోమని అన్నారు.
Recommended Video
నన్నూ, మా నాయకుడినీ జైలుకు తీసుకెళ్తారేమో..
తనను, తమ పార్టీ నాయకులు చంద్రబాబును కూడా జైలుపాలు చేయడానికి వైఎస్ జగన్ కుట్ర పన్నారని నారా లోకేష్ ఆరోపించారు. ఇలాంటివి తాను చాలా చూశానని చెప్పారు. జగన్ ఆటలు తమ ముందు సాగవని హెచ్చరించారు. ఆంధ్రలతో చిప్పకూడు తినిపించాలని భావిస్తే.. అలాంటి ఆటలు చెల్లవని, వారిని కాపాడటానికి తాము ఉన్నామని చెప్పారు. అచ్చెన్నాయుడు తిట్టినందుకే ఆయనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు.