సీఎం జగన్ ను కలిసిన రామసుబ్బారెడ్డి: చంద్రబాబు ఆరా: వైసీపీలోకి వెళ్తున్నట్లేనా..!
జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఆయనే దిక్కు. వైసీపీ నుండి ఆదినారాయణ రెడ్డిని ఆహ్వానించి..మంత్రి పదవి ఇచ్చినా రామసుబ్బారెడ్డి మాత్రం టీడీపీ వీడలేదు. తప్పని పరిస్థితు ల్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక, తాజా ఎన్నికల్లో ఇద్దరి మధ్య రాజీ ఫార్ములాలో భాగంగా రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు నుండి పోటీకి దింపి..ఆయనకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయాలని డిమాండ్ పెట్టారు. ఇక, ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. అయితే, టీడీపీలో సుదీర్ఘ కాలంగా ఉన్న రామసుబ్బారెడ్డి ఈ మధ్య సీఎం జగన్ ను కలిసారు. జగన్ సైతం ఆప్యాయంగా మాట్లాడారు. అది చంద్రబాబు వద్దకు చేరింది. కంగారు పడిన చంద్రబాబు ఏం జరిగిందని ఆరా తీసారు. ఇంతకీ జగన్ తో కలిసిన సమయంలో ఏం జరిగింది...చంద్రబాబుకు రామ సుబ్బారెడ్డి ఏం చెప్పారు..
నేడు సీఎం హోదాలో జగన్ సొంత జిల్లా పర్యటన .. జమ్మలమడుగు సభపై సర్వత్రా ఆసక్తి
జమ్మలమడగులో ఆయనే మిగిలారు
తెలుగుదేశం పార్టీలో జమ్మలమడుగులో చివరకు ఇప్పుడు రామ సుబ్బారెడ్డి చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఆదినారాయణ రెడ్డి కోసం తమ ప్రాధాన్యత తగ్గించటం పైన రామసుబ్బారెడ్డి అనుచరులు చాలా కాలంగా ఆగ్రహంతో ఉన్నారు. రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి..చంద్రబాబు మాట కోసం ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. అయితే, ఎమ్మెల్యేగా తాజా ఎన్నికల్లో రామసుబ్బారెడ్డికి పోటీకి అవకాశం ఇవ్వాలంటే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని..తన అన్న కుమారుడికి ఆ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి కండీషన్ పెట్టారు. అందుకు రామసుబ్బారెడ్డి సైతం అంగీకరించారు. అయితే, తాజా ఎన్నికల్లో ఎంపీగా ఆదినారాయణరెడ్డి..ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డి ఇద్దరూ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక, తాజాగా ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. తిరిగి ఇప్పుడు టీడీపీకి జమ్మలమడుగులో రామ సుబ్బారెడ్డి మిగిలారు. అయితే, ఆయన సైతం పార్టీ మారుతున్నారనే ప్రచారంతో చంద్రబాబు సైతం ఉలిక్కి పడ్డారు. వెంటనే నివారణ చర్యలు ప్రారంభించారు.
జగన్ ను కలిసిన రామసుబ్బారెడ్డి..
సీఎం జగన్.. రామసుబ్బారెడ్డి ఇరువురు విమానాశ్రయంలో కలుసుకున్న ఫొటో వైరల్ అవుతోంది. దీంతో..రామసుబ్బారెడ్డి కూడా టీడీపీని వీడుతున్నారని ప్రచారం మొదలైంది. రామసుబ్బారెడ్డి అమెరికాలో ఉన్న తన కుమారై వద్దకు కుటుంబసభ్యులతో కలిసి ఆగస్టు 16వ తేదీన వెళ్లారు. వాషింగ్టన్లో విమానం దిగారు. కచ్చితంగా అదే సమయంలో జగన్ కూడా అమెరికా పర్యటనకు వచ్చారు. ఎయిర్ పోర్టులో నుంచి బయటకు వస్తుండగా రామసుబ్బారెడ్డి, జగన్కు తారసపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య పలకరింపులు జరిగాయి. రామసుబ్బారెడ్డిని జగన్ పలకరించడంతో తన కుమారై వద్దకు వచ్చానని రామసుబ్బారెడ్డి చెప్పారు. రెండు నిమిషాలపాటు కుశల ప్రశ్నల అనంతరం ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. జగన్ పలకరింతతో రామసుబ్బారెడ్డి పులకరించారని..ఆయన సైతం వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో..ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే తనను కలవాల్సిందిగా రామసుబ్బారెడ్డికి సమాచారం పంపారు.
చంద్రబాబుతో ఆయన ఏం చెప్పారు..
రామసుబ్బారెడ్డి అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే చంద్రబాబును కలిశారు. జమ్మలమడుగులోని రాజకీయ పరిణామాలతో పాటుగా..తన మీద వైసీపీ లో చేరుతున్నానే ప్రచారం..దాని వెనుక జరిగిన పరిణామ క్రమం వివరించారు. వాషింగ్టన్లో జగన్ తనకు తారసపడిన విషయాన్ని కూడా వివరించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని చంద్రబాబుకు రామసుబ్బారెడ్డి చెప్పినట్లు సమాచారం. జమ్మలమడుగు లో ఆదినారాయణ రెడ్డి వర్గం మొత్తంగా బీజేపీలో చేరుతోందని చంద్రబాబుకు రామసుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే, జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రం రామసుబ్బారెడ్డి సైతం టీడీపీలో కొనసాగాలా లేదా అనే మీమీంసతో ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన వైసీపీలోకి వెళ్తారని కొందరు చెబుతున్నారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల సమయం లోగా నిర్ణయం తీసుకోవాలని సన్నిహితులు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రామసుబ్బారెడ్డి మాత్రం చంద్రబాబుతో తాను పార్టీ మారే ఉద్దేశం లేదని చెబుతున్నా..ఏం జరుగుతుందనే ఆసక్తి మాత్రం నియోజకవర్గంలో కనిపిస్తోంది.