టిడిపికి డిపాజిట్టు కూడ రాదు, వాళ్ళిద్దరితో పార్టీకి నష్టం: రాంపుల్లారెడ్డి సంచలనం
Recommended Video
ఆళ్ళగడ్డ: ఏపీ టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వ్యక్తిగత కక్షలు పార్టీపై ప్రభావం చూపుతున్నాయని ఆళ్ళగడ్డ నియోజకవర్గ మాజీ టిడిపి ఇంచార్జీ ఇరిగెల రాంపుల్లారెడ్డి చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో టిడిపికి డిపాజిట్లు కూడ దక్కవన్నారు.
టెన్షన్: ఆళ్ళగడ్డలో సుబ్బారెడ్డిపై రాళ్ళదాడి, మంత్రిపై ఫిర్యాదు, పోటాపోటీ
ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొంది.ఈ ఇద్దరు నేతలు పోటాపోటీగా నియోజకవర్గంలో సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు పోటాపోటీగా దీక్షలు నిర్వహించారు.
సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డిపై కొందరు వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. మంత్రి అఖిలప్రియ వర్గీయులే ఈ దాడికి పాల్పడ్డారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు.ఈ విషయమై పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో వీరిద్దరిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. అమరావతికి రావాలసి సూచించారు. ఈ ఇద్దరు నేతల తీరుపై టిడిపి ఆళ్ళగడ్డ మాజీ ఇంచార్జీ ఇరిగెల రాంపుల్లారెడ్డి మీడియా సమావేశంలో స్పందించారు.
టిడిపికి డిపాజిట్లు దక్కవు
ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చోటు చేసుకొన్న వివాదాలు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టిడిపికి డిపాజిట్లు కూడ దక్కవన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టారని రాంపుల్లారెడ్డి మంత్రితో పాటు సుబ్బారెడ్డిపై విమర్శలు గుప్పించారు.
పార్టీకి నష్టం కల్గిస్తున్నారు
ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డిలు పరస్పరం గొడవలు పెట్టుకోవడం, పోటాపోటీ ర్యాలీలు, దీక్షలు చేయడంతో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని ఆళ్ళగడ్డ టిడిపి మాజీ ఇంఛార్జీ ఇరిగెల రాంపుల్లారెడ్డి చెప్పారు. వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి పార్టీకి చేటు తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన భూమా అఖిలప్రియ ఏవీ సుబ్బారెడ్డిలపై విరుచుకుపడ్డారు.
బాబు దృష్టికి తీసుకెళ్తా
ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకొన్న పరిణామాలను టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు టిడిపి ఆళ్ళగడ్డ నియోజకవర్గ మాజీ ఇంఛార్జీ ఇరిగెల రాంపుల్లారెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో చోటు చేసుకొన్న పరిస్థితులపై బాబుకు వివరించనున్నట్టు చెప్పారు. ఈ ఇద్దరు నేతలు పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
జోక్యం చేసుకోవాలి
ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకొన్న పరిణామాలపై టిడిపి జిల్లా అధ్యక్షుడు, జిల్లా మంత్రి జోక్యం చేసుకోవాలన్నారు. మంత్రి అఖిలప్రియ, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య చోటు చేసుకొన్న విభేదాలను పరిష్కరించాలని ఆయన సూచించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున ఈ విషయమై పార్టీ నేతలు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.