టీడీపీలో అవమానాలు భరించా: జనసేనలో చేరిన మాజీ మంత్రి, ఆ పరిస్థితి వద్దని పవన్ కళ్యాణ్
విజయవాడ: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు శాసన సభ్యులు రావెల కిషోర్ బాబు టీడీపీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయాలనికి రాజీనామా లేఖను పంపించారు. అనంతరం ఆయన శనివారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడారు.
తాను కుల రాజకీయాలతో అలసిపోయానని చెప్పారు. యూపీ, బీహార్ తరహా కుల రాజకీయాలు నవ్యాంధ్రలో సరిపడవని చెప్పారు. రాష్ట్రం విడిపోయాక విజయవాడ రాజధాని అంటే గత చరిత్ర గుర్తుకు వచ్చిందని, ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత కారణాలతో రెండు వర్గాలుగా విడిపోయి బెజవాడను కుల ఘర్షణలకు ప్రాంతంగా మార్చారన్నారు.
అలాంటి పరిస్థితి మళ్లీ రావొద్దు
మళ్లీ అలాంటి పరిస్థితులు రావొద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు లా ఆండ్ ఆర్డర్ చూస్తారనుకున్నానని చెప్పారు. కానీ టీడీపీ వనరులు దోచుకుందని ఆరోపించారు. ఆడపడుచులను అగౌరవపరిచే ఎమ్మెల్యేలు, అధికారులను చెప్పుతో కొట్టే ఎమ్మెల్యేలను చూడాల్సి వస్తోందన్నారు. వయసు అయిపోయిన చంద్రబాబు విజన్ 2050 అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన కొడుకు ఆ తాను ముక్కే అన్నారు. ఇప్పటికే వయసు మళ్లిన సీఎం ఏం చేస్తారో అర్థం కావట్లేదన్నారు.
రావెలతో కలిసి ప్రయాణించా
తన సభలకు వచ్చే జనమంతా నా శక్తి అనుకోవడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. వారంతా మార్పు కోరుకుంటున్నవారు అన్నారు. రావెల కిషోర్ బాబు తనకు 2009 నుంచి తెలుసనని, జనసేన ఆయనను ఎమ్మెల్యేని చేస్తుందని, పదవి ఇవ్వడంతో పాటు అధికారం ఇస్తుందని చెప్పారు. 2009, 2014లో ఇలా రెండుమూడుసార్లు రావెలతో కలిసి ప్రయాణించానని చెప్పారు. అవకాశవాద రాజకీయాలు, డబ్బుతో కూడిన రాజకీయాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయాలన్నారు.
పదవులు ఇస్తున్నారు కానీ అధికారం లేదు
పదవులు ఇస్తున్నారు కానీ, అధికారం మాత్రం ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రావెల కిషోర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం చంపుకుని ఉండలేకే టీడీపీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి జనసేనలో చేరానని తెలిపారు. సాంఘిక, గిరిజన సంక్షేమ మంత్రిగా చంద్రబాబు తనకు అవకాశం ఇవ్వడాన్ని ఏనాడూ మరచిపోలేనని, కానీ అడుగడుగునా అవమానాలు, ప్రతిబంధకాలు ఎదుర్కొన్నానని చెప్పారు.
అలుపెరగని పోరాటం చేశా
పూలే ఉద్యమస్ఫూర్తి, అంబేడ్కర్ ఆదర్శాలను జనసేనాని పుణికిపుచ్చుకున్నారని రావెల చెప్పారు. ఏపీలో సమాజాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యం కులస్వామ్యంగా మారిందన్నారు. టీడీపీలో అలుపెరగని పోరాటం చేశానని, అవమానాలు, అవరోధాలు, పనిచేసే విధానంలో అడ్డంకులు అన్నారు. దళితులు, గిరిజనులు, మహిళల న్యాయపరమైన హక్కుల కోసం పవన్ పోరాడుతున్నారని, అందుకే జనసేనలో చేరానని చెప్పారు.
టీడీపీ నేతల ఆగ్రహం
మానవత్వం, కనీస విలువలు లేకపోవడం వల్లే రావెల కిషోర్ బాబు టీడీపీని వదిలేసి వచ్చారని నాదెండ్ల మనోహర్ అన్నారు. రావెల ఇన్నాళ్లు అవమానాలు భరించారని, ఏదో ఒకరోజు నిజాలు బయటకు రాక తప్పదని చెప్పారు. మరోవైపు, రావెల పార్టీ నుంచి వెళ్లిపోవడంతో తమ పార్టీకి పట్టిన మైల పోయిందని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రిగా చేస్తే ఇలా చేశారన్నారు.