జగన్కు నంద్యాల చిక్కులు: మరో 15 మంది ఎమ్మెల్యేలు జంప్, వారిద్దరు డుమ్మా
నంద్యాల ఉప ఎన్నికలో ఓటమితో వైయస్ జగన్ మరిన్ని చిక్కులు ఎదుర్కోబోతున్నారు. అప్పుడే తెలుగుదేశం పార్టీ ఆయనపై మైండ్ గేమ్ను ప్రారంభించినట్లు అర్థమవుతోంది.
Recommended Video
విజయవాడ: నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటమితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మరిన్ని చిక్కులు ఎదుర్కోబోతున్నారు. అప్పుడే తెలుగుదేశం పార్టీ ఆయనపై మైండ్ గేమ్ను ప్రారంభించినట్లు అర్థమవుతోంది.
ఇప్పటికే 20 మంది వైసిపి ఎమ్మెల్యేలను లాక్కున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత మంది ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న సంకేతాలను ఇస్తున్నారు. టిడిపి నాయకుడు జూపూడి ప్రభాకర రావు మాటలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
మరోవైపు, జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదనే ప్రచారం ఆయనను దెబ్బ తీసే ప్రమాదం ఉంది. తెలుగుదేశంలోకి వలస వెళ్లిన శాసనసభ్యులంతా ఆయన ఏకపక్ష ధోరణిని, ఎవరి సలహాలను వినకపోవడం వంటి లక్షణాలకు ఎక్కువ ప్రచారం కల్పించారు.
కొడాలి నానిపై తీవ్రంగా...
వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్యమంత్రి చంద్రబాబు మీద చేసిన అభ్యంతర వ్యాఖ్యలను రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. రోజాకు పట్టిన గతే కొడాలి నానీకి కూడా పడుతుందని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు. నంద్యాల ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ప్రతిపక్ష వైసిపి నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు.
మరో 15 మంది ఎమ్మెల్యేలు...
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి మరో 15 మంది వైఎస్సార్ సిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తామని అంటున్నట్లు జూపూడి ప్రభాకర రావు చెప్పారు. జగన్ 13 రోజులు నంద్యాలలో తిష్టవేసి, ప్రచారం చేసి, రాష్టస్థ్రాయి వైఎస్సార్ సిపి నాయకులను తరలించి, డబ్బులు పంచినా ఘోర పరాజయం చవిచూశారని, దాంతో వైసిపి ఎమ్మెల్యేల్లో అంతర్మథనం ప్రారంభమైందని ఆయన అన్నారు.
రోజాకు చెప్పినట్లే...
నంద్యాల ఉప ఎన్నిక పరాజయంతోనైనా వైఎస్సార్ సిపి బుద్ధి తెచ్చుకోవాలని జూపూడి ప్రభాకర రావు అన్నారు. నంద్యాల ఎన్నికల్లో నోరు పారేసుకున్న రోజాకు, ఓటర్లు ఏ విధంగా బుద్ధి చెప్పారో రేపు కొడాలి నానీకి కూడా ప్రజలు ఇదే విధంగా బుద్ది చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. అధికార పార్టీయే ఉప ఎన్నికల్లో గెలవటం సహజమన్న జగన్, 13 రోజులు నంద్యాలలో తిష్టవేసి ఇంటింటికి ప్రచారం చేసినా ప్రజలు తిరస్కరించారన్నారు. జూన్లో ఎంపిల చేత రాజీనామా చేయిస్తానన్న జగన్మోహన్రెడ్డి ఇప్పుడు మౌనం దాల్చటంలో ఆంతర్యం ఏమిటని ఆయన అడిగారు.
ఆ ఇద్దరు డుమ్మా...
జగన్కు ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వడం అప్పుడే ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు హామీల కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా మంగళవారం సాయంత్రం కావలి ఆర్ఎస్ఆర్ కల్యాణమండపంలో సభ జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి, వంటేరు వేణుగోపాల్రెడ్డి డుమ్మా కొట్టారు. ఆ ఇద్దరి నేతలకూ స్వాగత ప్లెక్సీలు కూడా కట్టారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ముఖ్య అతిథులుగా ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు.