చంద్రబాబు సొంత జిల్లాలో అసమ్మతి సెగ! ఓడిన అభ్యర్థి రాజీనామా! పునరాలోచనలో డీకే?
చిత్తూరు: తెలుగుదేశం చరిత్రలో ఏనాడూ ఎదుర్కోలేనంతటి దారుణ పరాజయం ప్రభావం పార్టీలో కాక పుట్టిస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటెత్తు పోకడలను ఇన్నాళ్లూ మౌనంగా భరిస్తూ వచ్చిన క్యాడర్.. ఈ ఓటమిని భరించలేకపోతోంది. అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన పార్టీ.. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అధినేతగా కొనసాగుతున్న పార్టీ.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత దారుణ పరాభవాన్ని ఎదుర్కోవాల్సి రావడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఈ ఓటమికి చంద్రబాబును బాధ్యుడిని చేయడానికి సాహసించని నాయకులు ఒక్కరొక్కరుగా తప్పుకొంటున్నారు.
చంద్రబాబు సొంత జిల్లాలోనే అసమ్మతి సెగ పుట్టడం గమనార్హం. మొన్నటి ఎన్నికల్లో గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసిన అనగంటి హరికృష్ణ రాజీనామా చేశారు. ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో తెలుగుదేశానికి గుడ్బై చెప్పారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ స్వామి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్గా మారింది. నారాయణ స్వామి 45 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. తెలుగుదేశం తరఫున పోటీ చేసిన హరికృష్ణకు పోలైన ఓట్లు 57 వేల పైచిలుకు మాత్రమే. ఈ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ హరికృష్ణ పార్టీకి రాజీనామా చేశారు.
ఆయన ఒక్కరే కాదు.. తెలుగుదేశం పార్టీ జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి బండి ఆనంద్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. పార్టీలో ఉన్న అన్ని పదవులు సహా ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని బట్టి చూస్తోంటే.. ఈ రాజీనామాల పర్వం ఇప్పట్లో ఆగేలా లేదు. పలువురు సీనియర్లు కూడా సర్దుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
దివంగత నేత డీకే ఆదికేశవులు నాయుడు అనుచరులు పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. డీకే ఆదికేశవులు నాయుడి మరణం తరువాత.. ఆయన భార్య సత్యప్రభ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చిత్తూరు నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. మొన్నటి ఎన్నికల్లో సత్యప్రభను కడప జిల్లా రాజంపేట లోక్సభ స్థానం నుంచి బరిలో దింపారు. ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూశారు. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడారు.
తనకు ఇష్టం లేకపోయినప్పటికీ.. రాజంపేట లోక్సభ బరిలో దించారని సత్యప్రభ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆరోగ్యం సహకరించట్లేదని ఓ లోక్సభ స్థానాన్ని తాను పర్యవేక్షించలేనని సత్యప్రభ మొదట్లోనే చంద్రబాబు వద్ద కరాఖండిగా తేల్చేశారని అంటున్నారు. అభ్యర్థి లేకపోవడం వల్ల సత్యప్రభను బలవంతంగా పోటీ చేయించాల్సి వచ్చిందని, చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకొచ్చి మరీ సత్యప్రభను రాజంపేట లోక్సభ నుంచి పోటీ చేయించారని చెబుతున్నారు. ఓటమి ఎదురు కావడంతో.. ఆమె కూడా పార్టీలో కొనసాగడంపై పునరాలోచనలో ఉన్నట్లు సమాచారం. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని సత్యప్రభ భావిస్తున్నట్లు తెలుస్తోంది.