'కాంగ్రెస్తోను కలిసేందుకు సిద్ధం': 2019లో ఏపీలో పొత్తుకు టీడీపీ పచ్చజెండా!
అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము పొత్తులకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ సహా ఏ పార్టీతో అయినా కలిసేందుకు సిద్ధమని ప్రకటించారు.
అప్పుడు కోహ్లీ ఉన్నాడు, బాధపడ్డాను: జగన్కు బాబు విజ్ఞప్తి, మోడీపై తీవ్రవ్యాఖ్యలు
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి (బీఎస్పీ అధినేత్రి), అఖిలేష్ యాదవ్లను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీతో పోరాడుతారని చెప్పారు. దేశవ్యాప్తంగా చంద్రబాబు లీడ్ చేయాలని జాతీయ నేతలు కోరుకుంటున్నారని చెప్పారు.
బీజేపీకి వ్యతిరేకంగా ఎవరితోనైనా కలుస్తాం
దేశవ్యాప్తంగా బీజేపీ ఓటమే తమ లక్ష్యమని, ఇందుకు ఎవరితోనైనా కలుస్తామని డొక్కా మాణిక్య వరప్రసాద్ తేల్చి చెప్పారు. తద్వారా కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు కూడా టీడీపీ సిద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. డొక్కా వ్యాఖ్యలను బట్టి ఏపీలోను కలిసి పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది.
అందుకే ఉక్కు పరిశ్రమ రాలేదు
ఆంధ్రప్రదేశ్లో ఐటీ దాడులు జరుగుతుంటే ఏపీ సీఎం, ఆయన పార్టీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు ప్రశ్నించారు. రాజకీయ ముసుగులో చంద్రబాబు అవినీతికి తెరలేపారన్నారు. ఐటీ సోదాలకు సీఎం రమేష్ బెంబేలెత్తుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు పన్నులు సక్రమంగా కడితే భయమెందుకని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో మీటింగులు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు లేవన్నారు. సరైన రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్లే కడప ఉక్కు పరిశ్రమ ఆలస్యమైందని చెప్పారు.
టీడీపీకి ఒక్క ఎంపీ సీటు రాదు
అఖిలేష్ యాదవ్ కేక వేస్తే చాలు చంద్రబాబు ఢిల్లీకి పరుగులు పెడతారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని చెప్పారు. చంద్రబాబు సొంత స్క్రిప్టులు రాసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. రెండో బ్రహ్మంగారు శివాజీ చెప్పినట్లు చంద్రబాబు నడుచుకుంటున్నారని చెప్పారు. దీక్షల పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.
నలబై ఏళ్ల అనుభవం ఉండి
ప్రతి వారం చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని జీవీఎల్ ప్రశ్నించారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి చిన్న చిన్న పార్టీలు సైతం పిలిస్తే ఢిల్లీకి వెళ్తారా అని ప్రశ్నించారు. రాయలసీమ నుంచి పలువురు ముఖ్యమంత్రులుగా చేసినా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని చెప్పారు. సీఎం చంద్రబాబు రాయలసీమను పూర్తిగా విస్మరించారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవుతుందని చెప్పారు.