ఎన్నికల కమిషనర్కు అక్కణ్నుంచి ఫోన్.. ఆ తర్వాతే వాయిదా ప్రకటన..
కరోనా మహమ్మారి పేరు చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయడాన్ని సీఎం జగన్ తప్పుపట్టారు. కనీసం ఆరోగ్య శాఖ అధికారుల్ని కూడా సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని సీఎం వాపోయారు. చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన రమేశ్.. ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలకు అడ్డుతగులుతున్నారని, వాయిదా తర్వాత కూడా బదిలీలకు ఆదేశాలివ్వడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మొత్తంగా ఎన్నికలు వాయిదావేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈలోపే టీడీపీకి చెందిన కీలక నేత ప్రకటన మరింత సంచలనం రేపింది.
స్థానిక ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతోందని ఆరోపించిన ప్రతిపక్ష పార్టీలు.. ఒక దశలో కరోనా వైరస్ ను బూచిగా చూపి ఎన్నికల్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశాయి. శనివారం నాటికే రాష్ట్రంలో 'మినీ హెల్త్ ఎమర్జెన్సీ'ని ప్రకటించిన సీఎం జగన్.. వైరస్ వ్యాప్తి నిరోధానికి అన్ని రకాలుగా సన్నద్ధమైనట్లు తెలిపారు. కరోనాపై సీఎం ఆదివారం మరోసారి సమీక్ష చేయాల్సిఉండగా.. ఆలోపే ఎన్నికల అధికారి రమేశ్ కుమార్ మీడియా ముందుకొచ్చి ఎన్నికల్ని ఆరువారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ క్రమంలో వైసీపీ దాడులు, అధికారుల బదిలీలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే..
ఈసీ ప్రకటనకు నిమిషాల వ్యవధిలో టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చేసిన ట్ సంచలనంగా మారింది. ఎన్నికలు వాయిదా వేయాల్సిందిగా తాను స్వయంగా ఈసీ రమేశ్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పానని, మీడియా ద్వారానూ రిక్వెస్ట్ చేశానని, దానికి స్పందనగానే స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేశారని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలంటూ రమేశ్ కుమార్ పై పొగడ్తలు కురిపించారు.
చంద్రబాబు తన అనుకూలత కోసం నియమించుకున్న వ్యక్తి రమేశ్ కుమార్ అని, ఎన్నికల కమిషనర్ కు ఉండాల్సిన ప్రాధమిక లక్షణాలను కూడా ఆయన మర్చిపోయారని, ఈ వ్యవహారాన్ని ఇంతటితో విడిచిపెట్టబోమని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో.. టీడీపీ నేతలు చెప్పడం వల్లే ఈసీ ఎన్నికల్ని వాయిదా వేసిందన్న చంద్రమోహన్ రెడ్డి వివరణ చర్చనీయాంశమైంది.