ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగనివ్వం: సుజనా చౌదరి
ఢిల్లీ: బడ్జెట్లో కేంద్రం రైతులకు పెద్ద పీ వేసిందని, తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లోను నష్టం జరగనివ్వమని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి సోమవారం నాడు చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన ఆయన స్పందించారు.
ఎస్సీ, ఎస్టీ, మహిళా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇచ్చేలా ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు బడ్జెట్లో వెసులుబాటు కల్పించారని చెప్పారు. రెండు అంకెల వృద్ధి సాధించేందుకు ఆరంభం ఈ బడ్జెట్ అన్నారు. ఏపీకి ఎలాంటి నష్టం జరగనివ్వమని, జరగదని చెప్పారు.
వ్యవసాయానికి పెద్దపీట: కిషన్ రెడ్డి
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారని తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేలా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసారని చెప్పారు.
పంటల బీమా ద్వారా రైతులు లబ్ధి పొందుతారని చెప్పారు. కరీంనగర్ జిల్లా వీణవంక బాధితురాలికి న్యాయం చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిందిలను కఠినంగా శిక్షించాలన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. తెరాస వాపును చూసి బలుపు అనుకుంటుందన్నారు. వరంగల్ ఎన్నికల్లో తమ ప్రతాపం చూపిస్తామన్నారు.