మోడీకి రూ.20 కోట్లు ఇస్తే జీవీఎల్కు పదవి, భారతి ఏమో కానీ.. రోజా మాత్రం: టీడీపీ నేత తీవ్రవ్యాఖ్య
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా, బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావుపై తెలుగుదేశం పార్టీ నేత రాజేంద్రప్రసాద్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జీవీఎల్ ప్రధాని నరేంద్ర మోడీకి పెద్ద మొత్తంలో లంచం ఇచ్చి పదవి దక్కించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అదే సమయంలో వైయస్ భారతి రెడ్డి ఈడీ ఛార్జ్ ఇష్యూపై వైసీపీ ఎమ్మెల్యే రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె శూర్పనఖ అని నిప్పులు చెరిగారు.
ప్రధానికి రూ.20 కోట్లు ఇస్తే జీవీఎల్కు పదవి
పీడీ అకౌంట్స్ పైన బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహ రావు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులను జీవీఎల్ అవినీతిపరులుగా చిత్రీకరిస్తున్నారన్నారు. జీవీఎల్ గ్రామాల్లోకి వస్తే సర్పంచులు, ఎంపీటీసీలు తరిమికొడతారన్నారు. కుక్కను సింహాసనంపై కూర్చోపెడితే ఇలాగే ఉంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి జీవీఎల్ రూ.20 కోట్లు లంచం ఇస్తే పదవి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారతి సీత అవునో కాదో కానీ, రోజా శూర్పణఖ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి రెడ్డి సీతాదేవి లాంటిది అవునో కాదో కానీ వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం కచ్చితంగా శూర్పణక అని రాజేంద్ర ప్రసాద్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. శూర్పణఖకు పట్టిన గతే రోజాకు పడుతుందన్నారు.
జగన్ హద్దుమీరి మాట్లాడుతున్నారు
జగన్ హద్దుమీరి మాట్లాడుతున్నారని డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. తండ్రి వయస్సు ఉన్న ముఖ్యమంత్రిపై తునిలో జగన్ ఉపయోగించిన భాష సరికాదని, దానిని సరి చేసుకోవాలన్నారు. అవినీతిలో భాగస్వామి అయినందునే భారతి పేరును ఈడీ పేర్కొందని, అందులో సీఎంకు, టీడీపీకీ సంబంధం లేదన్నారు. తనను ప్రశ్నిస్తే బీజేపీ కక్ష సాధింపు చర్యకు దిగుతోందని, రాయపాటి కంపెనీల్లో సోదాలు అవే అన్నారు.
ఏ నాయకుడు జగన్లా తెలివితక్కువగా మాట్లాడడు
నాలుగేళ్లలో ప్రాజెక్టులపై రూ.45,035 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. జలసంరక్షణ, చెక్ డ్యాములకు రూ.10,884 కోట్లు ఖర్చు చేశామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అన్ని రంగాలను వారు భ్రష్టు పట్టించారన్నారు. ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. స్కూల్ ఎగ్గొట్టిన పిల్లాడిలా జగన్ రోడ్లపై తిరుగుతున్నారన్నారు. ఇంత తెలివి తక్కువగా ఏ నాయకుడు మాట్లాడరన్నారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.