హైకోర్టుకు వంగలపూడి అనిత లేఖ: డాక్టర్ సుధాకర్ అరెస్టుపై సుమోటోగా కేసు: సర్కార్కు ఆదేశాలు
అమరావతి: మూడు రోజులుగా రాష్ట్రంలో రాజకీయ దుమారానికి ఎపిక్ సెంటర్గా మారిన డాక్టర్ సుధాకర్ అరెస్టు ఉదంతం.. హైకోర్టుకు చేరింది. డాక్టర్ సుధాకర్ అరెస్టు ఘటనపై తెలుగుదేశం పార్టీ నుంచి ఘాటు విమర్శలను ఎదుర్కొన్న జగన్ సర్కార్.. ఇక న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే హైకోర్టు నుంచి ప్రతికూల ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రభుత్వానికి డాక్టర్ సుధాకర్ అరెస్టు ఎపిసోడ్ తలనొప్పిని సృష్టించే అవకాశాలు లేకపోలేదు.
క్యాష్ కొట్టేశారు..ప్రీప్లాన్గా మద్యం బాటిళ్లు: పిచ్చాసుపత్రికి పంపిస్తారట: డాక్టర్ సుధాకర్
నడిరోడ్డు మీద అరెస్టు.. విమర్శలు..
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తోన్న ఎనస్థీషియాలజిస్ట్ డాక్టర్ సుధాకర్ను ఈ నెల 16వ తేదీన విశాఖపట్నం ఫోర్త్టౌన్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కాయపాలెం వద్ద నడిరోడ్డు మీద ఆయన అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన తీవ్రంగా ప్రతఘటించారు. దీనితో పోలీసులు ఆయనను నడిరోడ్డు మీదే, చేతులను వెనక్కి విరిచికట్టి బంధించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
జగన్ సర్కార్పై ఘాటు విమర్శలు..
ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున స్పందించింది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత వంటి నాయకులు పోలీసుల తీరును, ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. విమర్శలు గుప్పించారు. దళితుడైన డాక్టర్ పట్ల అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇదే ఉదంతంపై వంగలపూడి అనిత ఓ అడుగు ముందుకేశారు. డాక్టర్ సుధాకర్ అరెస్టు తీరును తప్పు పడుతూ హైకోర్టుకు లేఖ రాశారు.
హైకోర్టుకు లేఖ రాసిన వంగలపూడి అనిత
దళిత వర్గానికి చెందిన ప్రభుత్వ డాక్టర్ పట్ల జగన్ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని ఆరోపించారు. నడిరోడ్డు మీద ఆయనను అరెస్టు చేసిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో డాక్టర్లకు ప్రభుత్వం పీపీఈ కిట్లనే కాదు.. కనీసం మాస్కులను కూడా పంపిణీ చేయలేకపోతోందనే విషయాన్ని డాక్టర్ సుధాకర్ బహిరంగంగా వెల్లడించారని, దీనితో ఆయనపై ప్రభుత్వం కక్షకట్టిందని, పోలీసులను ప్రయోగించిందని చెప్పారు. నడిరోడ్డు మీద అరెస్టు చేయించిందని అన్నారు.
Recommended Video
బుధవారానికి విచారణ వాయిదా..
ఓ ప్రభుత్వ డాక్టర్ను కరడుగట్టిన నేరస్తుల తరహాలో అరెస్టు చేసిందని వంగలపూడి అనిత హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ సుధాకర్ అరెస్టుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలను ఆమె హైకోర్టుకు అందజేశారు. ఆయన న్యాయం చేయాలని విజ్ఙప్తి చేశారు. దీనిపై హైకోర్టు స్పందించింది. డాక్టర్ సుధాకర్ అరెస్టు ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించింది. ఆయనను న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును బుధవారానికి వాయిదా వేసింది.