జగన్ జాతకాల పిచ్చితోనే రాజధాని మార్పు .. మండిపడుతున్న వర్ల రామయ్య
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి జాతకాల పిచ్చి పట్టిందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్నటికి మొన్న టీడీపీ నేత జవహర్ ఇదే విషయాన్ని ప్రస్తావించగా తాజాగా వర్ల రామయ్య సైతం జగన్ జాతకాల పిచ్చి గురించే మాట్లాడారు.
రాజధాని ఈశాన్యంలో వుంటే జైలు కెళ్లకుండా నిశ్చింతగా వుండొచ్చుననే స్వామీజీల మాటలు జగన్ విన్నట్టు ఉన్నాడని, జాతకాల పిచ్చితో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజల జీవితాలలో చిచ్చు రేపారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫైర్ అయ్యారు . రాష్ట్రంలో రేగిన రాజధాని మంటలను చల్లార్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్పైనే వుందన్నారు.
అంతే కాదు జన్మతః క్రైస్తవుడైన జగన్కు హిందువైన స్వామీజీ ఈ జాతకాన్ని ఎలా చెప్పాడో అంటూ నిట్టూర్చిన వర్ల ఆయన దీన్ని ఎలా నమ్ముతున్నారో, ఏమీ అర్ధం కావడం లేదన్నారు. స్వామీజీలు కూడా ప్రజల విశ్వసనీయత కోల్పోతున్నారని చెప్పారు వర్ల.
ధర్మప్రబోధకులుగా వుండాల్సిన స్వామీజీలు ఇలాంటి జైలు పక్షులను ఎందుకు సమర్ధిస్తున్నారని వర్ల రామయ్య నిలదీశారు . సీఎం జగన్ 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని,అలాంటి వ్యక్తిని ఆలింగనం చేసుకున్నపుడే సదరు స్వామీజీ ప్రజల్లో గౌరవాన్ని కోల్పోయారని వర్ల రామయ్య పేర్కొన్నారు .
స్వామీజీ తాను జగన్కు ఏం చెప్పాడో , ఇక స్వామీజీ చెప్పిన మాటలు ఆయనకెలా అర్థమైందో గానీ అందుకే రాజధాని మారుస్తున్నాడని వర్ల ఆరోపించారు. రాజధాని ప్రజల ఆగ్రహాన్ని చవిచూడకముందే ఆ స్వామీజీ వివరణ ఇవ్వాలని వర్ల రామయ్య కోరారు.
సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. ఇక మొన్నటికి మొన్న మాజీ మంత్రి జవహర్ ఈ మూడు రాజధానుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ జాతకాల పిచ్చితోనే రాజధానిని మార్చుతున్నారని.. విశాఖ శారదాపీఠం స్వామి స్వరూపానందేంద్ర ఆలోచనతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.దీనివల్ల కేసీఆర్ కు మేలు జరుగుతుందని ఆయన ఆరోపణలు గుప్పించారు.