స్పీకర్ తమ్మినేని ఎడారి వ్యాఖ్యలపై అలా ..చిరంజీవి ప్రకటనపై ఇలా :టీడీపీ నేత వర్ల విసుర్లు
ఏపీ శాసనసభ సమావేశాల చివరి రోజు రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీ లో జరిగిన సుదీర్ఘ చర్చలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు ఉంటె బాగుంటుంది అని చేసిన ప్రకటనపై ఇప్పటికే రాజధాని రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏపీకి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత మంత్రులు, స్పీకర్ చేస్తున్న వ్యాఖ్యలు అనాలోచిత వ్యాఖ్యలని టీడీపీ నేతలు తమదైన శైలిలో మండిపడుతున్నారు.
స్పీకర్ వ్యాఖ్యలపై విరుచుకుపడిన టీడీపీ నేత వర్ల రామయ్య
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన మూడు రాజధానిలో ప్రకటనతో ఏపీలో అగ్గి రాజుకుంది. ఇక అప్పటినుండి నేటి వరకు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిని మించి ఒకరు మాటలతో దాడి చేసుకుంటున్నారు. తాజాగా అమరావతిని రాజస్థాన్ ఎడారి అంటూ,వందేళ్ళు అయిన అమరావతి అభివృద్ధి జరిగిందంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు, మూడు రాజధానుల నిర్ణయానికి చిరంజీవి మద్దతు ప్రకటించటంపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రంగా స్పందించారు.
ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా అన్న వర్ల
స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కళ్లులేని కబోదిలా మాట్లాడుతున్నారని వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. ఏపీ రాజధాని అమరావతి ఎడారిలా ఉందని మాట్లాడటం తప్పు అన్నారు టిడిపి నేత వర్ల రామయ్య. ఎడారి అయితే స్పీకర్ సీతారం ఎడారిలో కూర్చొనే అసెంబ్లీని నడుపుతున్నారా? అంటూ ప్రశ్నించారు.రాజధానిలో 4000 ఎకరాల ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని నిరూపిస్తే అసెంబ్లీ ఎదుట ఆత్మహత్య చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు వర్ల రామయ్య.
మంత్రి వర్గం అంతా ఫ్యాక్షనిస్ట్ విధానంలో నడుస్తుందన్న వర్ల
నిరూపించకపోతే మంత్రి బుగ్గన, తమ్మినేని సీతారాం తమ వ్యాఖ్యలపై రాజధాని రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ మంత్రివర్గం అంతా ఫ్యాక్షనిస్టు విధానంలో నడుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య అటు చిరంజీవి 3 రాజధానిలో ప్రతిపాదనకు మద్దతు కూడా విమర్శలు గుప్పించారు. చిరంజీవి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడాల్సి ఉందని, తొందరపడి ప్రకటనలు చేసినట్లుగా వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు .
చిరంజీవి ప్రకటన అవగాహనా రాహిత్యం అని మండిపాటు
చిరంజీవి చేసిన వ్యాఖ్యలను అవగాహన లేని రాజకీయ నేత చేసిన వ్యాఖ్యల్లా చూడాలా లేక పరిపక్వత లేని పౌరుడు సినిమా నటుడు చేసిన వ్యాఖ్యల్లా తీసుకోవాలా అంటూ వర్లరామయ్య ప్రశ్నించారు. అవగాహన లేమితో చిరంజీవి మాట్లాడినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా మూడు రాజధానుల నిర్ణయానికి ఎవరు మద్దతు పలికినావారిపై విరుచుకుపడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.