టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి వర్ల రామయ్య సోదరుడు, జగన్ వైపు ఎందుకు వెళ్తున్నారు?
అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.
సునీతకు భారీ షాక్.. పరిటాల రవి కీలక అనుచరుడి తిరుగుబాటు: వైసీపీలోకి, ఎందుకంటే?
త్వరలో వైసీపీలోకి వర్ల రామయ్య సోదరుడు
త్వరలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతతో నేడో, రేపో భేటీ కానున్నారు. వర్ల రత్నం... వర్ల రామయ్యకు అన్న. అంతేకాకుండా కృష్ణా జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు. ఇలాంటి కీలక నేత సోదరుడు, పార్టీలో కీలకంగా పని చేసిన రత్నం వైసీపీలోకి వెళ్తుండటం గమనార్హం. వర్ల రత్నం పార్టీ మారడానికి కారణాలు ఏమిటనే చర్చ సాగుతోంది.
ప్రతిపక్షాలకు ధీటైన జవాబు ఇచ్చేవారు
వర్ల రామయ్య టీడీపీలో ముఖ్యమైన నేత. టీడీపీ అధికార ప్రతినిధిగా పని చేశారు. అధికార ప్రతినిధిగా మీడియా ముందు పార్టీ వాదనను బలంగా వినిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రతిపక్షాలకు ధీటైన జవాబులు ఇచ్చేవారు. అలాంటి కీలక నేత వర్ల రామయ్య సోదరుడు జగన్ వైపు వెళ్తున్నారు.
ఎన్నికలకు ముందు మార్పులు, చేర్పులు
సార్వత్రిక ఎన్నికలకు ముందు పలువురు నేతలు వివిధ కారణాలతో పార్టీలు మారుతున్న విషయం తెలిసిందే. టీడీపీ నుంచి రావుల కిషోర్ బాబు, బీజేపీ నుంచి ఆకుల సత్యనారాయణలు జనసేనలో చేరారు. టీడీపీ మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరారు. అలాగే విజయసాయి రెడ్డి బంధువు ఒకరు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పురంధేశ్వరి బీజేపీలో ఉండగా, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, కొడుకు హితేష్ వైసీపీలో చేరుతున్నారు.