''విజయసాయి రెడ్డి అల్లుడికి విశాఖలో వేల ఎకరాలు.. ఆ భూముల్లోనే రాజధాని''
ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు వైసీపీ స్వప్రయోజనాల కోసమేనని ఆ పార్టీ ఆరోపిస్తోంది. విశాఖలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ దేవినేని ఉమా లాంటి ఆ పార్టీ నేతలు బలంగా ఆరోపిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా పలు ఆరోపణలు చేశారు. విశాఖలో విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి చెందిన కంపెనీకి వేలాది ఎకరాల భూమి ఉందన్నారు. ఆ భూముల్లో రాజధాని నిర్మించేందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
ఏపీ
కేపిటల్
ఇష్యూ
:
అసలేంటీ
బోస్టన్
కంపెనీ..
ఆ
నివేదికలో
ఏముంది..?
వర్ల రామయ్య ఆరోపణలు :
రాజధాని అంశాన్ని పరిశీలించే బాధ్యతను బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపుకు అప్పజెప్పడం వెనుక వేరే మతలబు ఉందన్నారు వర్ల రామయ్య. ఆ గ్రూప్ డైరెక్టర్ భట్టాచార్య విజయసాయి రెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డికి మిత్రుడని చెప్పారు. రోహిత్ రెడ్డి అరబిందో ఫార్మా కంపెనీ యజమాని అని.. ఆ కంపెనీకి విశాఖ-విజయనగరం మధ్య వేల ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు.
బోస్టన్ అదే చెప్పబోతోంది..
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు ఇవ్వబోయే తుది నివేదికలో రాజధానిని విశాఖలోనే ఏర్పాటు చేయాలని, అందునా రోహిత్ రెడ్డి భూములు ఎక్కడైతే ఉన్నాయో.. అదే ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాలని నివేదిక ఇవ్వబోతోందని వర్ల రామయ్య ఆరోపించారు. కేవలం తమ భూములను అభివృద్ది చేసుకోవాలన్న స్వార్థంతోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. దీనికోసమే బోస్టన్ గ్రూపును తెర పైకి తీసుకొచ్చారని ఆరోపించారు.
ఆ కంపెనీ విశ్వసనీయత ఉందా? :
అసలు బోస్టన్ కంపెనీకి ఉన్న విశ్వసనీయత,అనుభవం ఏపాటిదని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆ సంస్థ కేవలం యాడ్ ఏజెన్సీ మాత్రమేనని, అలాంటి సంస్థకు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ప్రాజెక్టు అప్పగించేడమేంటని నిలదీశారు. బోస్టన్ కంపెనీతో ఒప్పందానికి సంబంధించి జీవో బయటపెట్టాలన్నారు. ఆ సంస్థకు ఎంత ముట్టజెప్పుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బోస్టన్ అవినీతి గురించి తెలియదా? :
బోస్టన్ గ్రూపు గురించి ముఖ్యమంత్రికి తెలుసో లేదోనని, ఆ సంస్థపై అవినీతి ఆరోపణలున్నాయని వర్ల రామయ్య అన్నారు. 100 మిలియన్ పౌండ్ల కుంభకోణంలో బోస్టన్ గ్రూపు ఇరుక్కుందన్నారు.2017లో పోర్చుగీసు పోలీసులు బోస్టన్ గ్రూపుపై దాడి చేశారని గుర్తుచేశారు. ఆ సంస్థపై ఎఫ్బీఐ నిఘా కూడా ఉందని చెప్పారు.