పనికిమాలిన ఎంపీవి.. సీఎం రమేశ్ దెబ్బకి కుక్కురుమనలేదు.. ఏపీ గురించి నీకెందుకు?: జీవీఎల్పై వర్ల ఫైర్
రాజధాని తరలింపు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని, సీఎం జగన్ తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా కేంద్రం ఆమోదిస్తుందని పదే పదే చెబుతోన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుపై ప్రతిపక్ష టీడీపీ తీవ్రస్థాయిలో దాడికి దిగింది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి జీవీఎల్ తీరు అనుమానాస్పదంగా ఉందని ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలు కూడా అన్నారని, టెక్నికల్ గా ఏపీతో సంబంధంలేదని ఆయన ఇక్కడి వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం తగదని మండిపడింది.
12 రాజధానులు సరేనా?
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ జీవీఎల్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘నువ్వో పనికిమాలిన ఎంపీవి. యూపీ నుంచి ఎన్నికయ్యావు. ఏపీలో నీకేం పని? సీఎం జగన్ మూడు రాజధానుల కాన్సెప్టును బాహాటంగా సమర్థిస్తుండటం సిగ్గుచేటు. నువ్వు ప్రాతినిధ్యవ వహిస్తోన్న యూపీ.. దేశంలోనే పెద్ద రాష్ట్రం. ఆ లెక్కన యూపీలో 12 రాజధానుల ఏర్పాటు కరెక్టెనంటారా?''అని వర్ల ఫైరయ్యారు.
వైసీపీతో రహస్య మంతనాలు
బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఢిల్లీలో రహస్యంగా వైసీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని, ఈ విషయం తెలిసి ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని వర్ల రామయ్య తెలిపారు. ఈ మధ్యే ఢిల్లీలోని లోథి హోటల్ లో వైసీపీకి చెందిన ముఖ్యనేతతో జీవీఎల్ సమావేశమయ్యారని, బీజేపీ కూడు తింటూ.. వైసీపీ పాట పాడటం తగదని వర్ల విమర్శించారు.
కన్నా లేకుండా వద్దని చెప్పారుగా..
జీవీఎల్ నర్సింహారావు తీరుపై అనుమానం రావడం వల్లే బీజేపీ హైకమాండ్, ఆర్ఎస్ఎస్ నేతలు హెచ్చరికలు జారీచేశారని, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ లేకుండా ఎవరినీ కలవొద్దని ఆదేశాలున్నా.. జీవీఎల్ రహస్యమంతనాలు సాగిస్తూనే ఉన్నారని, ఏకంగా కన్నానే ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారని వర్ల రామయ్య చెప్పారు.
కుక్కిన పేరులా అయ్యారు..
బీజేపీకే చెందిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ చేతిలో జీవీఎల్ నర్సింహారావు పరాభవం ఎదుర్కొన్నారని వర్ల రామయ్య గుర్తుచేశారు. ఒక టీవీ డిబేట్ లో సీఎం రమేశ్.. జీవీఎల్ మధ్య వాగ్వాదం జరిగిందని.. అప్పుడు రమేశ్.. జీవీఎల్ ని ఉద్దేశించి ‘మీ బతుకంతా నాకు తెలుసు' అనడంతో జీవీఎల్ కుక్కినపేనులా కిక్కురుమనకుండా ఉండిపోయారని వర్ల రామయ్య వివరించారు. ఇప్పటికైనా జీవీఎల్ ఏపీలో వేలుపెట్టడం మానుకోవాలని, లేకుంటే రాష్ట్రప్రజల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.