అంబానీకి రాజ్యసభ సీటు ధర ఇదే.. సీఎం జగన్ ఓటు కూడా టీడీపీకే.. అసలు సినిమా ముందుంది..
''వైఎస్సార్ హెలికాప్టర్ కూలింది ప్రమాదవశాత్తూ కాదు.. కేజీ బేసిన్ లో గ్యాస్ కోసం రిలయన్స్ కంపెనీ, అంబానీ సోదరులే కుట్రలు చేశారని ఏడ్చింది వైఎస్ జగన్, ఆయన కుటుంబీకులు కాదా? ఏపీలో రిలయన్స్ కనబడటానికి వీల్లేదు.. రిలయన్స్ పెట్రోల్ బంకులు తగలబెట్టండి.. షాపులు ధ్వంసం చేయించండి.. అని కార్యకర్తల్ని, అభిమానులకు మెసేజ్ లు పంపి, అడ్డంగా దొరికిపోయింది మీ మనుషులు కారా? ఆనాటి రిలయన్స్ ఆస్తుల ధ్వంసం కేసుల్లో ఇరుక్కునవాళ్లలో 90 శాతం దళితులే ఉన్నారు.
అలాంటిది ఇవాళ అదే అంబానీ మనిషి నతర్వానీకి రాజ్యసభ టికెట్ ఎలా ఇచ్చారు? దాన్ని ఎంతకు అమ్ముకున్నారు? ఆ టికెట్ ధర ఎంతో నన్ను గుట్టువిప్పమంటారా?..''అంటూ అగ్గిమీదగుగ్గిలమయ్యారు టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థి వర్ల రామయ్య.
రాజ్యసభ టికెట్ రేటు ఇది..
2010నాటి రిలయన్స్ ఆస్తుల ధ్వంసం కేసుల్లో ఇరుక్కున్న దళిత బిడ్డలు.. తర్వాతి కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు రాక జీవితాలను కోల్పోయారని, జగన్ వైసీపీ పెట్టడానికి కారణమైన ఆ దళితుల త్యాగాలకు వెలకట్టి.. ఇవాళ అదే అంబానీకి రాజ్యసభ సీటు అమ్ముకున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. పరిమళ్ నత్వానీ ఎవరు? ఎక్కడివాడు? ఏ ప్రాతిపదికన ఆయనకు టికెట్ ఇచ్చారని అడిగే దమ్ము వైసీపీ దళిత నాయకులకు ఉందా? అని ప్రశ్నించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వర్ల పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తండ్రిని చంపినోడికి సన్మానమా?
‘‘ఈమధ్యే తాడేపల్లికి వచ్చిన ముఖేశ్ అంబానీకి సీఎం జగన్ శాలువాలుకప్పి, మెమొంటోలతో ఘనంగా సన్మానం చేశారు. అంబానీనికి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడైనా.. ‘వీడే కదా మా నాన్నను చంపించింది' అని జగన్ మనసులోనైనా అనుకుని ఉండడా? తండ్రిని చంపినవాడికి రాజ్యసభ టికెట్ ఇచ్చి సన్మానిస్తారు.. బాబాయిని చంపినవాళ్లు ఎవరో పట్టించుకోరు.. అంటే జగన్ కు కేవలం అధికార దాహం, డబ్బు లాలస తప్ప మంచి, మానవత్వం లేనేలేవు. వర్ల రామయ్యను చంద్రబాబు మోసం చేశాడని బాధపడిపోతున్న వైసీపీ నేతలంతా జగన్ దగ్గరికి వెళ్లి.. నత్వానీకి టికెట్ ఎంతకు అమ్ముకున్నావని నిలదీయాలి.
పోటీ నుంచి తప్పుకుంటా..
నాలుగు రాజ్యసభ సీట్లలో ఒక్కటి కూడా దళితులకు ఇవ్వని వైసీపీ.. ఇవాళ టీడీపీని ప్రశ్నించడం విచిత్రంగా ఉంది. సీఎం జగన్ కు, వైసీపీలోని దళిత ఎమ్మెల్యేలను నాదొక సవాల్. ఆ పరిమళ్ నత్వానీని తప్పించి.. అదే టికెట్ ను ఎవరైనా దళితులకు ఇవ్వండి.. వెంటనే నేను పోటీ నుంచి తప్పుకుంటాను. ఆ మేరకు చంద్రబాబును ఒప్పించే పూచీకూడా నాదే. మరో అభ్యర్థి అయోధ్యరామిరెడ్డి మాత్రం పొడిచింది ఏముంది? వీళ్లు పెద్దల సభకు పోవడం వల్ల దళితులకు ఏమైనా మేలు జరుగుతుందా? ఈనెల 13 దాకా టైముంది.. ఏం చేస్తారో మీరే తేల్చుకోండి..
జగన్ నాకే ఓటేయాలి..
ఇవాళ రాజ్యసభ బరిలో నిలబడ్డవాళ్లలో అంబేద్కర్ వాణిని బలంగా వినిపించగల సత్తా నా ఒక్కడికే ఉంది. కాబట్టే అడుగుతున్నాను.. పార్లమెంటులో దళితవాణి వినబడాలని జగన్ నిజంగా కోరుకుంటే.. ఆత్మప్రబోధానుసారం ఆయన కూడా టీడీపీ అభ్యర్థినైన నాకే ఓటేయాలి. మరీ ముఖ్యంగా వైసీపీలోని దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు రెండో ఆలోచన లేకుండా నన్నే గెలిపించాలి. కాదూకూడదంటే మాత్రం వైసీపీ దళిత ద్రోహి అని ఒప్పుకోవాల్సిందే.
మైక్ పగిలిందంటే నమ్ముతారు..
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవకాశాలు రాని సందర్భంలో నేను బాధపడ్డమాట నిజం. అంతమాత్రాన టీడీపీకి దూరం కాలేదు. తర్వాతి రోజునుంచే యాక్టివ్ గా పనిలో పడ్డాను. అలాంటిది వర్ల రామయ్య ఏడ్చాడని వైసీపీ మంత్రులు చెప్పడం దారుణం. నేను ఏడ్చేవాణ్నికాదు.. చంద్రబాబు తరఫున పోరాడే యోధుణ్ని. వర్ల గంభీరస్వరానికి మైక్ పగిలిందంటేటో.. బస్టాండులో తప్పుచేసినవాడి చంపె పగలగొట్టాననో అంటే నమ్మొచ్చుగానీ.. నా మీద వైసీపీ నేతలు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు.
Recommended Video
బలం లేకున్న బరిలోకి..
రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకోడానికి అవసరమైన 41 మంది ఎమ్మెల్యేలు లేకున్నా ప్రతిపక్ష టీడీపీ వర్ల రామయ్యను అభ్యర్థిగా దింపడం ఏపీలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు కుట్రలకు దళితుడైన రామయ్య బలైపోతున్నారంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. ఆ విమర్శలపై వర్ల స్పందిస్తూ.. రాష్ట్రంలో రామయ్య ఒక్కడే దళితుడు కాడని వైసీపీ నేతలు తెలుసుకోవాలని.. తనపై జాలి చూపిస్తున్నవాళ్లంతా జగన్ దగ్గరికెళ్లి.. నాలుగు సీట్లలో ఒక్కటైనా దళితులకివ్వాలని డిమాండ్ చేయాలని వర్ల సూచించారు.