పవన్ కు టిడిపి షాక్: మీడియాలో కన్పించేందుకు వపన్ ఆరాటం, ఎవరైతే తప్పేంటీ?
మీడియాలో కన్పించాలనే ఉద్దేశ్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలను సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తప్పుబడుతూ ప్రకటనలు చేస్తున్నారని టిడిపి నేత వర్లరామయ్య ఆరోపించారు.
అమరావతి: మీడియాలో కన్పించాలనే ఉద్దేశ్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలను సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తప్పుబడుతూ ప్రకటనలు చేస్తున్నారని టిడిపి నేత వర్లరామయ్య ఆరోపించారు.
ఉత్తరం, దక్షిణం అంటూ ఇండియాను విడదీసే పనిని పవన్ కళ్యాణ్ పెట్టుకోవదన్ని ఆయన హితవుపలికారు. సింఘాల్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.
తెలుగువాడైన వీరయ్యచౌదరి కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశరాజకీయాల్లో చంద్రబాబు చక్రంతిప్పుతున్నారని, మీడియా ప్రచారం కోసమే చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన పవన్ ను కోరారు.
2019 లో పాండవులైన టిడిపికి, కౌరవులైన వైసీపీకి మద్య ఎన్నికల కురుక్ష్రేతం సాగనుందన్నారు. దీనిలో విజయం సాధించేది టిడిపియేనని ఆయన జోస్యం చెప్పారు.
మరో వైపు పవన్ కళ్యాణ్ ట్వీట్ పై తిరుమలలో మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. భక్తిభావం ఉన్నవారెవరైనా స్వామివారికి సేవ చేయవచ్చన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడం సరికాదన్నారు.
టిటిడి ఈవోగా ఉత్తరాదికి చెందిన అధికారిని నియమించడంపై ట్విట్టర్ లో పవన్ ఘాటుగా స్పందించడాన్ని ఆయన తప్పుబట్టారు. స్వామివారికి సేవ చేయడానికి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనే ప్రశ్న ఉత్పన్నం కాకూడదన్నారు. స్వామివారికి సేవచేసే వ్యక్తికి ప్రాంతంతో పనిలేదన్నారు. సేవచేసే ఏ వ్యక్తి అయినా ఈవోగా అర్హులేనని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకొంటున్న ప్రభుత్వాన్ని విమర్శించేలా నటుగు పవన్ కళ్యాణ్ కు ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని టిడిపి నేత వైవిబి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. పవన్ తన వైఖరిని మార్చుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు.నిన్నటివరకు తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి తెలుగువాడని ఆయన గుర్తు చేశారు.