జగన్ గుండెజారి గల్లంతయింది.. కామెడీకైనా హద్దుండాలయ్యా.. కృష్ణా నదికీ కరోనా టెస్టులు..
సుదీర్ఘ గ్యాప్ తర్వాత ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లోకి అడుగుపెట్టడంతో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మిగతా అంశాల మాదిరిగానే కరోనా వైరస్ కట్టడిలోనూ వైసీపీ సర్కారు దారుణంగా ఫెయిలయ్యారన్న ప్రతిపక్షం.. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే ఏడాది పాలన పేరుతో సంబురాలు జరుపుకొంటున్నారని మండిపడింది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరుగుతోన్న 'మన పాలన - మీ సూచన' మేధోమథన సదస్సులపైనా దుమారం కొనసాగుతున్నది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్య మధ్య డైలాగ్ వార్ ఒక రేంజ్ లో సాగిందిలా..
చంద్రబాబుకు ఆహ్వానం..
వైసీపీ సర్కారు ఏడాది కాలంగా అమలుచేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై ‘మన పాలన-మీ సూచన'ల పేరుతో ఆరు రోజుల పాటు(ఈనెల 30 వరకు) రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మేథోమధన సదస్సులు నిర్వహిస్తున్నది. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో నిర్వహిస్తోన్న ప్రధాన కార్యక్రమానికి సీఎం జగన్ అధ్యక్షత వహిస్తున్నారు. తొలిరోజు ‘పరిపాలన-సంక్షేమం'పై సదస్సు జరగగా, రెండోరోజైన మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చించారు. సోమవారం సాయంత్రం ఏపీకి చేరుకున్న చంద్రబాబును సీఎం కార్యక్రమానికి రావాలంటూ ఎంపీ విజయసాయి అడగటంతో రచ్చ మొదలైంది..
ఎదురుచూపులు..
కరోనా వైరస్ మొదలుకొని రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఎప్పటికప్పుడు టీడీపీ శ్రేణులతో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ, ప్రజలకు అండగా ఉండాలని సూచిస్తుండటం తెలిసిందే. ఇదే అంశాన్ని విజయసాయి ప్రస్తావిస్తూ.. ‘‘సలహాలు, సూచనలు అంటూ జూమ్ లో ప్రతిరోజూ ఊదరగొట్టావు కదా! ఏడాది పాలన పై సీఎం జగన్ స్వయంగా సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ సదస్సుకు మీరు కూడా హాజరై అమూల్యమైన సూచనలు, సలహాలు ఇస్తారని ప్రజలంతా ఎదరు చూస్తున్నారు. మీరు మాత్రం ఇటువైపునకు రాకుండా కరకట్ట దారి పట్టారేమిటి జ్ఞానీ?''అని వ్యాఖ్యానించారు. దీనిపై..
కొండ నాలుకకు మందేస్తే..
సీఎం సదస్సులకు చంద్రబాబు రావాలంటూ వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబును వెళ్లనీయకుండా వైసీపీ సర్కారు అడ్డుపడిన తీరును ప్రస్తావిస్తూ.. ‘‘విజయసాయిరెడ్డి గారు! మా చంద్రబాబు విశాఖపట్నం వస్తానంటేనే మీకు, మీ నాయుడు జగన్ కు గుండెజారి గల్లంతయింది. ఇక, ప్రత్యక్ష సమావేశానికి రమ్మని పిలుస్తున్నావే.. గుండెలాగిపోవు? కామెడీకైనా ఓ హద్దుండాలయ్యా.. మీలాంటోడికే.. కొండ నాలుకకు మందు వేస్తే, వున్న నాలుక పోయిందట.. తస్మాత్ జాగ్రత్త..''అని వర్ల ఫైరయ్యారు.
కరకట్టపై కరోనా వీరులు..
వర్ల రామయ్య పంచ్ ను పట్టించుకోకుండా ఎంపీ విజయసాయి.. చంద్రబాబుపై విమర్శల దాడిని కొనసాగించారు. టీడీపీ అధినేత ఏపీలోకి అడుగుపెట్టిన సందర్భంలో లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించారని, తద్వారా కరోనా వ్యాప్తికి కారకులయ్యారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పలు చోట్ల కేసులు, హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం తెలిసిందే. కృష్ణా నది కరకట్టపై నివసిస్తోన్న బాబును కరోనా వీరుడిగా పోల్చుతూ..‘‘కరోనా వీరులు కరకట్ట మీద వాలారట! ఇక కృష్ణా నదికి కూడా కోవిడ్ టెస్టులు చేయాలేమో''అని వైసీపీ నేత ఎద్దేవా చేశారు.