జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్
అమరావతి: మాజీ మంత్రి వసంత నాగేశ్వర్ రావుతో పాటు ఆయన తనయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణ ప్రసాద్ గురువారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
గత ఎన్నికల సమయంలో వసంత నాగేశ్వర్ రావు ఆయన తనయుడు టిడిపిలో చేరారు. అయితే ఆ తర్వాత పార్టీలో ప్రాధాన్యత లేదని వసంత కృష్ణప్రసాద్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.
ఈ తరుణంలో ఇటీవలనే వసంత కృష్ణప్రసాద్ ను కొందరు టిడిపి నేతలు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్ళారు. గుంటూరు జిల్లాలో పనిచేయాలని వసంత కృష్ణప్రసాద్కు సూచించారు.కానీ ఆయన టిడిపిని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఈ తరుణంలో గురువారం నాడు తన అనుచరులతో కలిసి కృష్ణా జిల్లా కైకలూరులో సాగుతున్న జగన్ పాదయాత్రలో వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిని వీడి వైసీపీలో చేరారు. వసంత కృష్ణ ప్రసాద్ తో ఆయన ఆయన తండ్రి వసంత నాగేశ్వర్ రావు కూడ వైసీపీలో చేరారు.
కృష్ణా జిల్లాలో వైసీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వసంత నాగేశ్వర్ రావు,కృష్ణ ప్రసాద్లు ప్రకటించారు. మరో వైపు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కూడ వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే రామ్ కుమార్ రెడ్డి మాత్రం తాను ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని రెండు మూడు మాసాల్లో ప్రకటించనున్నట్టు చెప్పారు.