జగన్ చేతకానితనం, వైఎస్ కుటుంబానికి ఓటమి శకం మొదలైంది: వీరశివారెడ్డి సంచలనం
Recommended Video
అమరావతి: టీడీపీ నేత వీరశివారెడ్డి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం రాజకీయ చరిత్రలో ఆ కుటుంబానికి ఓటమి అనేదే తెలియదని, జగన్ చేతకానితనం వల్ల ఇప్పుడు ఆ కుటుంబానికి ఓటమి శకం మొదలైందని వ్యాఖ్యానించారు.
చదవండి: మోడీజీపై నమ్మకముంది.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారు: వైఎస్ జగన్ ఆశాభావం
వైయస్ మరణానంతరం వ్యాపారరంగం నుంచి జగన్ రాజకీయాల్లోకి వచ్చారని... ఆయన అసమర్థ రాజకీయాలతోనే వారి రాజకీయ కోట బీటలువారుతోందని వీరశివారెడ్డి ఎద్దేవా చేశారు.
విజయమ్మ ఓటమికి కారణమిదే...
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ విశాఖ నుంచి తన మాతృమూర్తి విజయమ్మను పోటీకి నిలబెట్టారని, అయినా ఫలితం లేకపోయిందని, ఆవిడ గెలిస్తే పులివెందుల సంస్కృతి ఎక్కడ విశాఖకు పాకుతుందో అనే భయంతోనే ... అక్కడి ప్రజలు విజయమ్మను తిప్పికొట్టారని శివారెడ్డి వ్యాఖ్యానించారు.
ఓటమే ఎరుగని వివేకానందరెడ్డి...
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సామాన్యుడి చేతిలో... ఓటమే ఎరుగని వైయస్ వివేకానందరెడ్డి సైతం ఓడిపోయారని టీడీపీ నాయకుడు వీరశివారెడ్డి గుర్తు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారని... అయితే, జగన్ అసమర్థత కారణంగా 23 మంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీ నుంచి దూరంగా వచ్చేశారని ఎద్దేవా చేశారు.
అధికార దాహంతో రోడ్లపై తిరుగుతూ...
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికార దాహంతో పిచ్చిపట్టిందని, అందుకే ఇప్పుడు రోడ్లపై తిరుగుతున్నారని వీరశివారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రతిపక్ష నేత... రోడ్లపై తిరగడమేంటని ప్రశ్నించారు.
ఇదీ ప్రజలను మోసం చేయడమే...
అసెంబ్లీలో ప్రజాసమస్యలను చర్చించకుండా, రోడ్లపై తిరగడం... ప్రజలను మోసం చేయడమేనని వీరశివారెడ్డి వ్యాఖ్యానించారు. అవినీతి, అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడిన జగన్... రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై జగన్ కు చిత్తశుద్ధి ఉంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు.