సీఎం జగన్ వల్లే ఏపీకి మొండిచేయి: కేంద్ర బడ్జెట్పై టీడీపీ నేత యనమల
సీఎం జగన్ తుగ్లక్ చర్యలు, పనికిమాలిన విధానాలవల్లే కేంద్రం బడ్జెట్ లో ఏపీకి మొండిచేయి చూపిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. పాతిక మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానని, నిధులు తెస్తానని బీరాలు పలికిన జగన్.. చివరికి ఒక్క ప్రాజెక్టును కూడా సాధించలేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై యనమల శనివారం మీడియాతో మాట్లాడారు.
సీఎంగా ఎన్నికై మొదటి సారి ఢిల్లీకి వెళ్లినప్పుడే.. అమరావతికి నిధులు ఇవ్వొద్దంటూ ప్రధానిని జగన్ కోరారని, అందువల్లే రెండు బడ్జెట్లలోనూ రాష్ట్రానికి నిధులు రాలేదని యనమల గుర్తుచేశారు. ఎంతసేపూ అవినీతి కార్యక్రమాలే తప్ప సీఎంకు మరో పనిలేదని, కేంద్ర నిధులు రాబట్టే సత్తా జగన్ లో లేదని మండిపడ్డారు. గత ఎనిమిది నెలలుగా పోలవరం లాంటి కీలక ప్రాజెక్టులతోపాటు రాష్ట్రమంతటా అభివృద్ది పనులు నిలిచిపోయాయయని, పీపీఏల రద్దు విషయంలో దేశవిదేశాలు హెచ్చరించినా పట్టించుకోకుండా జగన్ మూర్ఖంగా వ్యవహరించారని ఆరోపించారు.
జగన్ తుగ్లక్ చర్యల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన సంస్థలన్నీ వెనక్కి పారిపోతున్నాయని, సింగపూర్, కియా ఆగ్జిలరీ యూనిట్లు, డేటా సెంటర్, రిలయన్స్, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ తదితర కంపెనీల నిర్ణయాలే అందుకు ఉదాహరణ అని యనమల చెప్పారు. సీఎం పచ్చిచేష్టల వల్ల కేవలం ఎనిమిది నెలల్లోనే ఏపీ సుమారు లక్షకోట్ల పెట్టుబడులు కోల్పోయిందన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎం జగన్దేనని యనమల అన్నారు.