అచ్చెన్నాయుడిని హతమార్చే పథకం .. ఆయన ప్రాణాలకే ప్రమాదం .. కస్టడీకి అందుకే : టీడీపీ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ లో ఈఎస్ఐ మందుల కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి టిడిపి నేత అచ్చెన్నాయుడును ఏసీబీ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో నిన్న అర్ధరాత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పై హైడ్రామా నడిచింది. ఇక ఈ వ్యవహారంపై టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు.రెండు సార్లు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి , అనారోగ్యంగా ఉన్నాడన్న కనీస మానవత్వం కూడా లేకుండా, ఆయన ప్రాణాలకు ముప్పు కలిగేలా వైసిపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడుతున్నారు.
అర్దరాత్రి హైడ్రామా .. అచ్చెన్న ప్రాణాలే లక్ష్యమా ?
అచ్చెన్నాయుడును ఈరోజు నుండి మూడు రోజులపాటు ఏసీబీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. రెండోసారి ఆపరేషన్ జరిగి విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పాక కూడా అచ్చెన్నాయుడును అర్థరాత్రి బలవంతంగా అదుపులోకి తీసుకోవాలనే కుట్ర చూస్తుంటే ప్రభుత్వం ఆయన ప్రాణాలే లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానంగా ఉంది అని నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. బీసీ నేత అచ్చెన్నాయుడుపై ఇన్ని కుట్రలు జరుగుతుంటే వైసీపీలో ఉన్న బీసీ నేతలు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు లోకేష్.
అచ్చెన్నాయుడు ప్రాణాలకు ఏ మాత్రం హాని జరిగినా జగన్ దే బాధ్యత : లోకేష్
వైయస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ ఒక్కటే చెబుతోంది అచ్చెన్నాయుడు ప్రాణాలకు ఏ మాత్రం హాని జరిగినా దానికి మీరే బాధ్యత వహించాలి. లేదంటే బీసీలు మిమ్మల్ని క్షమించరని పేర్కొన్నారు లోకేష్. టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని హాస్పటల్లోనే విచారించాలని ఏసీబీ అధికారులకు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని అయినా ఇంత దుర్మార్గంగా అర్ధరాత్రి హాస్పిటల్ నుండి ఎలా డిశ్చార్జ్ చేయాలని అనుకున్నారని ప్రశ్నించారు.
కస్టడీలోనే చంపాలని ప్రయత్నం : దేవినేని ఉమా
అచ్చెన్నాయుడు అరెస్ట్,ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి జరిగిన హైడ్రామా పై టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ ఆస్పత్రిలో ఉన్న అచ్చెన్నాయుడును హతమార్చాలని దుర్మార్గమైన పథకం వేశారని ఆరోపణలు గుప్పించారు. సజ్జల రామకృష్ణారెడ్డి డైరక్షన్లో బడుగు బలహీన వర్గాల్లో పార్టీ నాయకుడుగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న అచ్చెన్నాయుడును అరెస్టు చేసి రాత్రి కస్టడీలోనే చంపాలని ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు దేవినేని ఉమా.
Recommended Video
జగన్ కు టీడీపీ నాయకులను అణగదొక్కాలనే పిచ్చి పరాకాష్టకుచేరింది : చినరాజప్ప
అచ్చెన్నను అరెస్ట్ చేయాలని, జైల్లో పెట్టాలని వైసిపి చేస్తున్న ప్రయత్నాలు దారుణమని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప . సీఎం జగన్ లో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం నాయకులను అణగదొక్కాలనే పిచ్చి పరాకాష్టకు చేరిందని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి అచ్చెన్నాయుడును ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి అరెస్టు చేయాలని ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. ఒకపక్క కోర్టు ఆయనను ఆసుపత్రిలో విచారించాలని సూచించినా అర్ధ రాత్రి డిశ్చార్జ్ చెయ్యాలని చూసి , వైసిపి ప్రభుత్వం హైడ్రామా చేసిందని మండిపడ్డారు.