ఏపీ టీడీపీకి ఎమైంది? ఆసుపత్రిలో కోడెల..అజ్ఞాతంలో కూన రవి, యరపతినేని: అదే జాబితాలో సోమిరెడ్డి!
అమరావతి: తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన కొందరు సీనియర్ నేతలు పార్టీ ఫిరాయిస్తోంటే.. మరికొందరు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. అధికారాన్ని కోల్పోయిన అతి కొద్దిరోజుల్లోనే ఇలాంటి ప్రతికూల పరిస్థితులను చవి చూడాల్సి వస్తుందని అనుకోలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు వాపోతున్నాయి. స్వయంకృతాపరాధాల వల్లే ఈ దుస్థితి తలెత్తిందని పేర్కొంటున్నాయి. పార్టీకి చెందిన కొందరు నాయకులు చేస్తోన్న తప్పిదాల వల్ల వ్యూహాత్మకంగా, పకడ్బందీగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి దొరికిన అవకాశాలను చేజేతులా పోగొట్టుకోవాల్సి వస్తోందని పార్టీ నాయకులు చెబుతున్నారు. కృష్ణానదికి సంభవించిన వరదల సమయంలో చేసిన ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు బూమరాంగ్ అయ్యాయని అభిప్రాయపడుతున్నారు.
భారత్ తో యుద్ధానికి ముహూర్తం పెట్టేశాం..ఓడిపోయే ప్రసక్తే లేదు: రైల్వేమంత్రి ప్రేలాపన
ఆసుపత్రిలో కోడెల..
అసెంబ్లీ ఫర్నిచర్ ను తన సొంత అవసరాల కోసం వినియోగించినట్లు విమర్శలను ఎదుర్కొంటున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ లోని అసెంబ్లీ భవన సముదాయాన్ని రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో తరలించే సమయంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ ఫర్నిచర్, కొంత సామాగ్రి మాయం అయ్యాయి. వాటన్నింటినీ అప్పటి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు తన నివాసానికి తరలించినట్లు గుర్తించారు. గుంటూరు, సత్తెనపల్లిల్లోని నివాసాలు, క్యాంపు కార్యాలయాల్లో అసెంబ్లీ ఫర్నిచర్ ను తరలించినట్లు స్వయంగా కోడెల అంగీకరించారు కూడా. మూడురోజుల కిందటే ఫర్నిచర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అనంతరం- కోడెల గుండెపోటుకు గురయ్యారు. ఈ నెల 23వ తేదీన ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
Recommended Video
అక్రమ మైనింగ్ కేసులో యరపతినేని..
గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు అజ్ఞాతంలోకి వెళ్లారు. అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన అదృశ్యం అయ్యారు. ఎక్కడ ఉన్నారనే విషయం తెలియరాలేదు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన నియోజకవర్గం పరిధిలో యరపతినేని అక్రమంగా మైనింగ్ నిర్వహించారనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై సీఐడీ విచారణ నిర్వహించింది. ఓ నివేదికను రూపొందించి హైకోర్టుకు అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన తరువాత హైకోర్టు.. ఈ కేసు విచారణను సీబీఐకి బదలాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వెలువడిన 24 గంటల తరువాత నుంచి యరపతినేని జాడ తెలియ రావట్లేదని అంటున్నారు.
ఎంపీడీఓను బెదిరించిన కేసులో కూన రవికుమార్..
ఎంపీడీఓను చెట్టుకు కట్టేసి కొడతానంటూ ఫోన్ లో బెదిరించిన మాజీ విప్ కూన రవికుమార్ జాడ కనిపించట్లేదు. ఈ ఘటనలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నరబుజ్జిలి ఎంపీడీఓ, రెవెన్యూ అధికారులను దుర్భాషలాడిన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కూన రవికుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలియ రావట్లేదని అంటున్నారు. ఎంపీడీఓను బెదిరించిన కేసులో కూన రవికుమార్ తో పాటు మరో 11 మందిపై 353, 427, 506, 143, సెక్షన్ (3) పీడీపీపీ యాక్ట్ 1984ల కింద కేసు నమోదైంది. అజ్ఞాతంలో ఉంటోన్న కూన రవికుమార్ ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఈలోగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసే అవకాశాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఫోర్జరీ కేసులో మాజీమంత్రి సోమిరెడ్డి..
తాజాగా అదే జాబితాలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. ఆయనపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఫోర్జరీ కేసులో ఏ1గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరును నమోదు చేశారు పోలీసులు. ఈ కేసు నమోదైన తరువాత సోమిరెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్లారని చెబుతున్నారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిన వార్తలను కుటుంబ సభ్యులు, అనుచరులు తోసిపుచ్చతున్నారు. ఆయన ఎక్కడికీ వెళ్లలేదని, కేసును ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఫోర్జరీ సంతకం చేసిన కొన్ని నకిలీ డాక్యుమెంట్ల ద్వారా సుమారు రెండున్నర ఎకరాల భూమిని రియల్టర్లకు విక్రయించినట్లు సోమిరెడ్డిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సోమిరెడ్డితో పాటు మరో ముగ్గురిని ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. ఇందులో సోమిరెడ్డిని ఏ1గా చేర్చడం గమనార్హం. వెంకటాచలం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇడిమేపల్లిలో సర్వే నంబరు 58-3లో 2.40 ఎకరాల భూమిని ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ల ద్వారా రియల్టర్లకు అమ్మేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీనితో ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్లారని, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.