15 రోజులు దాక్కున్న జగన్: వైసిపి-చంద్రబాబు మధ్య 'మోడీ' గొడవ, సుజాత మరో ఝలక్
రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది.
విజయవాడ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. జగన్ తన వద్ద ఉన్న నల్ల డబ్బును తెల్లగా ఎలా మార్చుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారని టిడిపి చెబుతుండగా, నోట్ల రద్దు ముందే తెలిసిన చంద్రబాబు హెరిటేజ్ ద్వారా నల్ల ధనాన్ని తెల్లగా మార్చుకుంటున్నారని వైసిపి, ఆ పార్టీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు.
వైయస్ జగన్ మంగళవారం నాడు మరోసారి హెరిటేజ్ అంశాన్ని లాగారు. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు జగన్ పైన నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా, మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ పైన మాట్లాడే హక్కు జగన్కు లేదన్నారు. జగన్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు.
దివిస్ పరిశ్రమకు అనుమతి ఇచ్చిందే వైయస్ రాజశేఖర రెడ్డి అని జగన్కు షాకిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తే జైలుకు పంపుతారనే భయంతో జగన్ ఆయనను ఏమీ అనటం లేదన్నారు. నోట్ల రద్దు పైన జగన్ 15 రోజుల తర్వాత స్పందించడం విడ్డూరమన్నారు. జగన్ పదిహేను రోజులు దాక్కొని ఇప్పుడు ఓట్ల కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అంతకుముందు, టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వర రావులు కూడా జగన్ పైన నిప్పులు చెరిగారు. హెరిటేజ్ 23 ఏళ్ల కష్టమని, జగన్లా సూటుకేసు కంపెనీల నుంచి పుట్టుకు రాలేదని ఎద్దేవా చేశారు.