వైసీపీకి ఓటేస్తారా?: నంద్యాలలో మహిళలపై టీడీపీ నేతల అరాచకం!
ఉపఎన్నికలో వైసీపీకి ఓటేశారన్న కారణంతోనే తమపై దాడి చేసినట్లుగా బాధితులు చెప్పారు.
నంద్యాల: ఉపఎన్నికకు ముందు మాటల యుద్దం వరకే ఆగిపోయిన ఇరు పార్టీలు.. ఇప్పుడు బాహాబాహికి దిగుతున్నాయి. ఇరు పార్టీల నేతల నడుమ నంద్యాలలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుండం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
తాజాగా వైసీపీకి ఓటేశారన్న కారణంతో ఇద్దరు మహిళలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ ఇళ్లకు అడ్డంగా ఇసుక ట్రాక్టర్లను ఏర్పాటు చేయడంపై ప్రశ్నించినందుకు.. ఉపఎన్నికలో వైసీపీ ఓటేశారని తమపై ఎదురుదాడి చేసినట్లుగా బాధితులు చెబుతున్నారు. దీనిపై వారు టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
టీడీపీ కార్యకర్త సుబ్బయ్య కక్ష సాధింపు చర్యతోనే ఈ దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. వైసీపీకి ఓటేశామన్న కారణంతో ఉద్దేశపూర్వకంగానే ఇసుక ట్రాక్టర్లను తమ ఇళ్ల సమీపంలో రోడ్డుకు అడ్డం పెట్టారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే.. మహిళ అని కూడా చూడకుండా దుర్భాషాలడుతూ చీర లాగి కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అడ్డుకోబోయిన మరో మహిళపై కూడా దాడి చేశారని ఆరోపించారు. తమ ఇంట్లో ఉన్న వస్తువులను కూడా ధ్వంసం చేసి కుమారుడిపై దాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు.