Olectra Greentech: రూ.1500 కోట్లు రూ.20వేల కోట్లు ఎలా అవుతుంది?
అమరావతి: పోలవరం రివర్స్ టెండరింగ్ విజయవంతమైన నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు తెరలేపిందని వైసీపీ వర్గీయులు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును దాదాపు రూ.500 నుంచి రూ.600 కోట్లకు తక్కువకు మేఘా ఇంజినీరింగ్కు కట్టబెట్టి, అందులో వచ్చే నష్టాన్ని మరో రకంగా తీర్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. మేఘాకు ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు జగన్ ప్రభుత్వం మేఘా అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ నుంచి వచ్చే అయిదేళ్లలో దశల వారీగా దాదాపు రూ. 3380 కోట్ల విలువైన బస్సులను జగన్ ప్రభుత్వం కొనుగోలు చేయనుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
జగన్ రూ.58 కోట్లు ఆదా చేశారా? సేవింగ్ పేరుతో రూ.32,000 కోట్ల బెనిఫిట్!!
ఎలక్ట్రిక్ బస్సులకు రూ.10వేల కోట్లు కేటాయించిన కేంద్రం
అయితే ఏడాది కిందట ఇదే చంద్రబాబు ఒలెక్ట్రా బస్సులో తన అనుచరులతో కలిసి ప్రయాణించారని గుర్తు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సు ఎక్కి కాలుష్యంలేని అమరావతి అని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల్ని ఏపీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నారు. ఫేమ్ 2 (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) విధానం కింద దేశంలో 7,090 ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెట్టేందుకు రూ.3545 కోట్ల ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం అన్ని రకాల వాహనాలను కలిపితే మొత్తం పదివేల కోట్లను కేంద్రం కేటాయించింది.
చంద్రబాబు విధానాలనే జగన్ ప్రభుత్వం కొనసాగిస్తోంది..
రాష్ట్రాల రవాణా సంస్థలు విద్యుత్ బస్సుల్ని కొనుగోలు చేసేందుకు ప్రతి కిలోవాట్ సామర్థ్యానికి రూ.20 వేల రాయితీని సైతం ప్రకటించింది. అలాగే రాష్ట్ర రవాణా సంస్థ నిర్వహణ వ్యయాల ఆధారంగా కూడా రాయితీలను కేంద్రం భరిస్తుంది. ఇందులో భాగంగానే పలు రాష్ట్రాలు విద్యుత్ వాహానాల విధానాల్ని ప్రకటించాయి. విద్యుత్ బస్సుల కొనుగోలుకు రాష్ట్రాలు టెండర్లను పిలుస్తున్నాయి. ఈ ప్రక్రియ చంద్రబాబు హయాంలోనే మొదలైందని చెబుతున్నారు. ఇప్పుడు జగన్ వచ్చి చేస్తోంది.. చంద్రబాబు విధానాలను కొనసాగిస్తూ మేఘా కంపెనీ నుంచి బస్సుల్ని కొనుగోలు చేయడమే అంటున్నారు. ఇప్పుడు టీడీపీ నేతల వాదన ఇదే. చంద్రబాబు విధానాన్ని కొనసాగిస్తున్నామని చెబుతూ దీంతో పోలవరం ద్వారా మేఘాకు వస్తున్న నష్టాన్ని భర్తీ చేసే ఉద్దేశ్యంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా భారీ ప్రయోజనం చేకూరేలా చేస్తున్నారని అంటున్నారు.
1,500 కోట్లు రూ.20 వేల కోట్లు ఎలా అవుతుంది?
దీంతో ప్రస్తుతం దాదాపు రూ.1500 కోట్లుగా ఒలెక్ట్రా గ్రీన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,000 కోట్లకు చేరుతుందని, అందువల్ల మేఘా కృష్ణారెడ్డికి కంపెనీలో ఉన్న వాటా విలువ రూ.1000 కోట్ల నుంచి ఏకంగా రూ.11 వేల కోట్లకు చేరుకుంటుందని లెక్కలు చెబుతున్నారు. కానీ వారు చెబుతున్నట్లుగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఎం-క్యాప్ శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత రూ. 1528.35 కోట్లు. ఈ కంపెనీ మేఘా హోల్డింగ్స్ వాటా 44.47 శాతం. అంటే మేఘా హోల్డింగ్స్ వాటా విలువ రూ. 679.66 కోట్లు. శుక్రవారం నాటికి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ షేరు ధర నేషనల్ స్టాక్ ఎక్స్చేంజిలో రూ. 192.05 వద్ద క్లోజ్ అయింది. వారు ఆరోపిస్తున్నట్లుగా ఎం-క్యాప్ రూ.20,000 కోట్లకు చేరుకోవాలంటే షేర్ ధర కనీసం రూ.2520గా ఉండాలి. కానీ అది అసాధ్యమని గుర్తు చేస్తున్నారు.
బీవైడీతో ఓలెక్ట్రా ఒప్పందం
గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్ ఒలెక్ట్రాగా మారకముందు చైనాకు చెందిన అతిపెద్ద బ్యాటరీ కంపెనీ బీవైడీతో ఒప్పందం చేసుకుంది. బీవైడీ పోటీ కంపెనీ టెస్లా బ్యాటరీలు విఫలమై పేలిపోయాయి. ఇప్పటివరకు బీవైడీ బ్యాటరీలు పేలిన లేదా పనిచేయకుండా విఫమైన సందర్భాలు లేవు. ఈ కారణంగానే బీవైడీలో కేవలం 1.92 శాతం వాటా కోసం శ్యామ్సంగ్ 450 మిలియన్ డాలర్లు చెల్లించింది. ఇప్పటికే కార్లతో సహా వివిధ రకాల వాహనాలను ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టిన బీవైడీ దేశీయ మార్కెట్లోకి వ్యాన్లను కూడా త్వరలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి పెద్ద కంపెనీతో గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్గా ఉన్నప్పుడే ఒప్పందం కుదిరింది.
తొలి ప్రదర్శన
ఇప్పటికే అనేక రాష్ట్రాలలో తిరుగుతున్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ బస్సుల్ని తొలిసారిగా ప్రదర్శించింది అమరావతిలో కావడం గమనార్హం. ఆ తర్వాత తిరుమల కొండకు ట్రయల్ నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుంచి రోహతంగ్ పాస్ వరకు అత్యంత ఎత్తైన ప్రదేశానికి ప్రయాణించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కింది. కేరళలో అయ్యప్పస్వామి యాత్రకు ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ, కర్ఱాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికే ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. గత వారమే ముంబైలో దాదాపు పది ఒలెక్ట్రా బస్సుల్ని సీటీ సర్వీస్ కోసం బెస్ట్ ప్రవేశపెట్టింది. పూణేలో సీటీ బస్సులుగా ఉన్నాయి. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు నడుస్తోన్న ఎలక్ట్రిక్ బస్సుల్లో 40 ఒలెక్ట్రావే. ఇక్కడ మరో విషయం అశోక్ లేలాండ్ కూడా ఇటీవలే ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపిస్తున్నా అవి ఎత్తైన ప్రదేశాలను చేరుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాలలో విజయవంతంగా నడుస్తున్నవి ఒలెక్ట్రా గ్రీన్టెక్ బస్సులే. ఇవి కాక, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటకతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రం ఇస్తున్న రాయితీని ఉపయోగించుకోవడానికి విద్యుత్ బస్సుల కోసం టెండర్లను పిలుస్తున్నాయి. ఫేమ్ 2 లో భాగంగానే ఏపీ కూడా త్వరలో విద్యుత్ బస్సుల కోసం టెండర్లను పిలువొచ్చు. ఈ టెండర్లలో ప్రమాణాలు, ఉత్పత్తి సామర్థ్యం, సాంకేతిక అంశాల కారణంగా బస్సుల కొనుగోలు జరుగుతుంది.