చంద్రబాబుకు షాక్, వైసీపీలో చేరిన మరో ఎంపీ, అందుకే టీడీపీకి గుడ్బై
హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మరో పార్లమెంటు సభ్యులు సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరుతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా, సోమవారం వైసీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గెలిచిన ఆయన జగన్తో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ కండువా కప్పుకున్నారు.
ఇటీవలే వైసీపీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్తో కలిసి లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ వైసీపీలో చేరడం తనకు పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందని చెప్పారు. చంద్రబాబుతో రాష్ట్రానికి ఏమీ రావని చెప్పారు. ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు. తనకు టీడీపీ ఎంపీ సీట్ ఇవ్వకపోవడంతోనే వైసీపీలో చేరుతున్నాననేది అవాస్తవం అన్నారు.
కాగా, రవీంద్రబాబు ప్రస్తుతం టిడిపిలో ప్రాధాన్యత లభించటం లేదనే భావనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు పైనా హామీ లభించటం లేదు. టిడిపి నుండి ఈసారి అమలాపురం లోకసభ అభ్యర్ది రిటైర్డ్ న్యాయమూర్తి బాలయోగి కుమారుడు పోటీ చేసే అవకాశముంది. దీంతో రవీంద్ర బాబు వైసీపీలో చేరారని తెలుస్తోంది. 2014లో రవీంద్రబాబు వైసీపీ అభ్యర్ది విశ్వరూప్పై విజయం సాధించారు.