రాజధాని తిరకాసు: దొనకొండ.. జగన్ కొన్నచోట రాలేదనా? బోండ తిరకాసు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక, ఆ పార్టీ నేతలు... రాజధాని అమరావతిలో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, లక్ష కోట్ల కుంభకోణమని ఆరోపిస్తున్నారు.
సాక్షిలో వచ్చిన కథనాలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. సాక్షి కథనాల ఆధారంగా వైసిపి నేతలు రోజా, అంబటి రాంబాబు, ఇతర నేతలు తెలుగుదేశం పార్టీ నేతల పైన దుమ్మెత్తి పోస్తున్నారు. సాక్షి కథనాలు, వైసిపి నేతల వ్యాఖ్యల పైన టిడిపి నేతలు గురువారం స్పందించారు.
ఇందులో కొందరు నేతలు తాము భూములు కొన్నామని చెబితే, మరికొందరు తమకు భూములు ఉంటే జగన్, వైసిపి నేతలు, సాక్షి జర్నలిస్టు పేరు మీదే రాసిస్తామని సవాల్ చేస్తున్నారు. కథనాలపై స్పందిస్తున్న టిడిపి నేతలు కొందరు.. కేవలం తమ పైన వచ్చిన ఆరోపణల పైననే స్పందిస్తున్నారు.
మిగతా నేతల గురించి ప్రశ్నిస్తే.. తెలియదని చెబుతున్నారు. ఈవాళ ఎంపీ మురళీ మోహన్ తన పైన వచ్చిన ఆరోపణల పైన స్పందించారు. మిగతా నేతల గురించి ప్రశ్నిస్తే తనకు తెలియదని అభిప్రాయపడ్డారు. పయ్యావుల కేశవ్ కూడా దాదాపు అదేవిధంగా స్పందించారు. అయితే, తమ పార్టీ నేతలు తప్పు చేయరని చెబుతున్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి అంశం మాత్రం అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సాక్షి కథనాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు.
రాజధాని ప్రాంతంలో వైసిపి నేతలు, కడప, పులివెందుల వాళ్లు కూడా కొన్నారని, వారి గురించి సాక్షి ఎందుకు రాయలేదని టిడిపి నేతలు ప్రశ్నించారు. తనకు రాజధాని ప్రాంతంలో 196 ఎకరాలు ఉందని రాశారని, దానిని నిరూపిస్తే వారికే పంచుతానని, నిరూపించకుంటే సాక్షి పత్రికను మూసివేస్తారా అని పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు.
విచారణపై సవాళ్లు, ప్రతి సవాళ్లు
తాము ఆధారాలతో సహా చూపించామని, ఇక టిడిపి నేతలు తమ నిజాయితీ నిరూపించుకునేందుకు సిబిఐ, సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని వైసిపి, కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నేతలు చెబుతున్నారు. ఓట్లు వేసిన వారు కూడా ఉన్నారు.
బోండా ఉమ తిరకాసు
విచారణ పైన బోండ ఉమ మాత్రం తిరకాసు పెట్టారు. వైసిపి నేతలు చేసే అవాస్తవ, నిరాధార, అసత్య ఆరోపణలకు విచారణ అనవసరమని, ఇలా ప్రతి దాని పైన విచారణ చేసుకుంటూ పోతే రోజుకు ఎన్నో వస్తాయన్నారు. మిగతా చాలామంది టిడిపి నేతలు మాత్రం ఎలాంటి విచారణ, చర్చకు సిద్దమంటున్నారు.
జగన్ ఎందుకు తెరపైకి తెచ్చాడంటే...!
సాక్షి పత్రిక రాజధాని కథనాల వెనుక.. తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టిడిపిలో చేర్చుకోవడమే కారణంగా చాలామంది భావిస్తున్నారు. వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నందున.. దానిని కార్నర్ చేసేందుకే జగన్ మీడియా అవాస్తవ కథనాలు రాసిందని టిడిపి నేతలు చెబుతున్నారు.
అయితే, పయ్యావుల కేశవ్ మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశారు. దొనకొండ ప్రాంతంలో జగన్ పెద్ద ఎత్తున భూములు కొన్నాడని, అక్కడ రాజధాని రాకపోవడంతో అసహనంతో ఇప్పుడు తప్పుడు కథనాలు రాయించారని ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వస్తే తాను భూములు కొన్నచోట రాజధాని పెట్టేవాడని, తమలా ప్రజా రాజధాని పెట్టకపోయేవాడని అభిప్రాయపడ్డారు.