టీడీపీ సంచలన డిమాండ్... ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని... గవర్నర్కు నేతల ఫిర్యాదు...
హిందూ దేవాలయాలపై దాడులు,వాటిని వ్యతిరేకిస్తూ టీడీపీ,బీజేపీ ఆందోళనలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. నిన్న మొన్నటిదాకా పాలనా పరమైన అంశాలు,ప్రభుత్వ విధానాల చుట్టూ తిరిగిన రాజకీయ విమర్శలు,ఆరోపణలు ఇప్పుడు మతం చుట్టూ చేరి భగ్గుమంటున్నాయి. వైసీపీ నేతలు చెప్తున్నట్లు దీని వెనకాల కుట్రలు దాగున్నాయో లేదో తెలియదు గానీ హిందుత్వ సెంటిమెంటును రగిల్చేందుకు ఈ పరిస్థితులు ఎంతో కొంత దోహదపడే అవకాశం లేకపోలేదు.
ప్రతిపక్ష టీడీపీ,బీజేపీ నేతలు మాత్రం ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మండిపడుతున్నాయి. తాజాగా రాష్ట్ర టీడీపీ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిసి విగ్రహాల ధ్వంసం దాడుల ఘటనలపై ఫిర్యాదు చేశారు.
సీబీఐ దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి...
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర,తెనాలి శ్రవణ్ కుమార్లు గురువారం(జనవరి 7) గవర్నర్ విశ్వభూషణ్ హరించదన్ను కలిశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆలయాలపై దాడులు,విగ్రహాల ధ్వంసం ఘటనలు దాదాపుగా 144 వరకు జరిగాయని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వీటన్నింటి పైనా సీబీఐ దర్యాప్తు జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని చెప్పారు.
రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్..
గవర్నర్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ నేతలు సంచలన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని పాలించే అర్హత వైసీపీ కోల్పోయిందని... ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఇప్పటివరకూ 140కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయని గవర్నర్కు చెప్తే ఆయన కూడా ఆశ్చర్యపోయారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కేసులు పెట్టాలని చూస్తే జరగబోయే పరిణామాలకు డీజీపీనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రశ్నిస్తున్నవాళ్లపై అక్రమ కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
ఆ స్వామీజీలు ఎందుకు స్పందించట్లేదు...
ఆలయాలపై దాడులు,విగ్రహాల ధ్వంసం ఘటనలపై డీజీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని... మత సామరస్యం దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. జగన్ తమ ఆత్మ అని చెప్పే కొందరు మఠాధిపతులు,స్వామిజీలు ఇప్పుడెందుకు స్పందించట్లేదని అన్నారు.
జగన్ ఇప్పుడే నిద్ర లేచారా : టీడీపీ
హిందూ ధర్మాన్ని కాపాడకుండా కేవలం రాజకీయాల కోసమే పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రహదారుల విస్తరణలో తొలగించిన ఆలయాలపై జగన్ ఇప్పుడే నిద్రలేచేరా అని నిలదీశారు. వరుస దాడుల ఘటనలను పక్కదారి పట్టించేందుకే జగన్నాటకానికి సీఎం తెరలేపారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం దేవాలయాల పునరుద్దరణకు శ్రీకారం చుట్టడం... గతంలో విజయవాడలో రహదారుల విస్తరణ సందర్భంలో తొలగించిన ఆలయాల శంకుస్థాపనకు సీఎం సిద్దమవడంతో టీడీపీ ఈ విమర్శలు చేస్తోంది.