నిన్న దేవినేని అవినాష్..రేపు వల్లభనేని వంశీ..నెక్స్ట్ కాట్రగడ్డ?: వేడెక్కిన బెజవాడ
విజయవాడ: రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉన్న విజయవాడలో అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉన్న విజయవాడ గానీ, కృష్ణా జిల్లా గానీ..అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతోంది. టీడీపీ యువజన విభాగం అధ్యక్షుడు, గుడివాడ అభ్యర్థి దేవినేని అవినాష్, కడియాల బుచ్చిబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇక- వల్లభనేని వంశీ కూడా వైసీపీలో చేరడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తాను వైసీపీలో చేరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల్లో జగన్ ను కలుస్తానని వెల్డించారు.
పట్టు కోల్పోతున్నట్టేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులకు గట్టి పట్టు జిల్లా కృష్ణా. కృష్ణా సహా అటు గుంటూరు, ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశానికి కంచుకోటలు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. కారణాలేమైనప్పటికీ.. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం ఆయా జిల్లాల్లో చావుదెబ్బ తింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కృష్ణాజిల్లాలో రెండు చోట్ల మాత్రమే టీడీపీ గెలుపొందింది. ఆ రెండు కూడా విజయవాడ నగరం పరిధిలోనివే.
Recommended Video
గన్నవరం ఖాళీ..
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన జెండా పాతిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ కాబోతోంది. టీడీపీ అభ్యర్థిగా అతి తక్కువ మెజారిటీతో తన ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకట్రావుపై విజయం సాధించిన వల్లభనేని వంశీ.. పార్టీకి గుడ్ బై చెప్పారు. రెండు వారాల కిందటే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కొద్దిరోజుల పాటు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన గురువారం వార్తల్లోకి ఎక్కారు. తాను వైఎస్సార్సీపలో చేరబోతున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గం ప్రజట అభీష్టం మేరకే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని స్పష్టం చేశారు.
ఉరుము లేని పిడుగులాగా..
దేవినేని అవినాష్ వైఎస్సార్సీలో చేరుతారనే వార్తలు ముందు నుంచీ ఉన్నప్పటికీ.. ఆయన వాటిని తోసిపుచ్చిన సందర్భాలు కూడా ఒకట్రెండు ఉన్నాయి. తాను ఏ పార్టీలోకి వెళ్లట్లేదంటూ విలేకరుల ముందే స్పష్టం చేశారు. దీనితో ఈ వార్తలకు కొద్దిరోజుల పాటు తెర పడింది. అదే సమయంలో అవినాస్ ఒక్కసారిగా విజయవాడ టీడీపీలో కలకలం పుట్టించారు. వైఎస్సార్సీపీలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అదే రోజు సాయంత్రమే వైఎస్ జగన్ ను కలిశారు. తన అనుచరుడు కడియాల బుచ్చిబాబుతో కలిసి పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
నెక్స్ట్.. కాట్రగడ్డ బాబు
ఈ పరిస్థితుల్లో మరి కొందరు నాయకుల పేర్లు తెర మీదికి వస్తున్నాయి. వారిలో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు కాట్రగడ్డ బాబు. తెలుగుదేశాన్ని గుడ్ బై చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. వల్లభనేని వంశీతో కలిసి గానీ, ఆ తరువాత గానీ ఆయన వైఎస్సార్సీపీలో చేరతారని అంటున్నారు. కాట్రగడ్డ బాబుతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన మాజీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరతారని, దీనికోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇదివరకే ప్రకాశం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, రవికుమార్ వైసీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్న విషయం తెలిసిందే.