‘ఇదేం జగన్-కేసీఆర్ పంచాయతీ కాదు! ఇలా చేసిన తొలి సర్కారు జగన్మోహన్ రెడ్డిదే!!’
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారంపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తప్పుబట్టారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నదీ జలాల పర్యవేక్షణకు అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైనా.. ఈ కమిటీని పరిగణలోకి ఎందుకు తీసుకోవడం లేదని తెలుగురాష్ట్రాల సీఎంలను ప్రశ్నించారు.
సొంత వ్యవహారమా?
విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. నదీ జలాలపై రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను అపెక్స్ కమిటీ పరిష్కరిస్తుందని, దీనికి సంబంధించి పార్లమెంటులో చట్టం చేశారని గుర్తు చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్లు మాత్రం తమ సొంత వ్యవహారంలా ప్రకటనలు చేయడం ఏంటని నిలదీశారు.
గాలికొదిలేస్తారా?
నదీ జలాల పంపిణీ వ్యవహారం వ్యక్తిగత పంచాయతీ కాదని అన్నారు. బచావత్ ట్రైబ్యునల్, నీటి పంపిణీపై ఒక్కసారి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించలేదని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రజలు, రైతుల హక్కులు కాపాడాల్సిన బాధ్యతను గాలికొదిలేస్తున్నారని మండిపడ్డారు.
నోరుమెదపరేం..
చట్టబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాపై సీఎం జగన్ నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా కర్ణాటకలో అనేక ప్రాజెక్టులు నిర్మించారని, ఇప్పుడు జగన్ అలానే వ్యవహరిస్తే ఏపీకి అన్యాయమే జరుగుతుందని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
తొలి ప్రభుత్వం జగన్దే..
ఇది ఇలావుంటే, మరో టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మోడీ కూడా జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. అర్హులైన రైతులకు న్యాయం చేసేలా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలన్నారు. నిబంధనలు, కులాల పేరుతో నిరుపేద కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టడం సరికాదని అన్నారు. కులాల పేరుతో రైతులను విడదీసిన తొలి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదేనని చురకలంటించారు.