మోకాళ్లు అరుగుతున్నాయ్..ఇంకా సైకిల్ ఏం తొక్కుదాంలే అబ్బా...! తెలుగు తమ్ముళ్ల లో నైరాశ్యం..!!
అమరావతి/హైదరాబాద్ : ఒక్క ఓటమి వెయ్యి కుదుపులకు కారణమవుతుంది అంటారు. ఈ సామెత ఇప్పుడు ఏపి టీడిపికి అతికినట్టు సరిపోతుంది. సైకిల్ పై ముందుకు వెళ్లలేమని, ఫ్యాన్ కింద కూర్చుందామని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారా...? ఒకరొక్కరుగా టీడీపీని వీడుతున్నారా...? ఇంకొన్నాళ్లకు, సైకిల్ పై సవారీ చేసేవాళ్లు తగ్గుతారా...? వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితేమిటి...? వర్తమాన రాజకీయాలను గమనిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ వస్తున్న సందేహాలివి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ... స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులను, ఫ్యాన్ కిందకు రావాలంటూ సాదరంగా ఆహ్వానిస్తోంది. వైఎస్ జగన్ సొంత ప్రాంతమైన రాయలసీమ నుంచి ఇది మొదలు కాబోతోంది.
వలసలు షురూ..! సైకిల్ కు స్టాండేసి తాళం వేద్దామంటున్న నేతలు..!!
రాయలసీమకు ముఖ ద్వారమైన కర్నూలు జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరిగాయి. ఈ జిల్లాలోని అన్ని స్థానాలను వైసీపీ గెలుచుకుంది. దీంతో, ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. టీడీపీ నేతలు మాత్రం, ఏం చేయాలో అర్థమవక అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నారు. మండల, గ్రామస్థాయిలో కీలక పాత్ర పోషించే నాయకులపై వైసీపీ నాయకులు వల విసురుతున్నారు. మరీ ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుచర వర్గంపై దృష్టి కేంద్రీకరించారు. కోట్ల, కేఈ కుటుంబాలతో విభేదాలున్న వారు, వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఊగిసలాడుతున్న నేతలు..! మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఫిరాయింపులు..!!
ఆలూరు నియోజకవర్గంలో కీలక నేతలైన కప్పట్రాళ్ల బొజ్జమ్మ దంపతులు ఎన్నికలకు ముందే టీడీపీకి గుడ్బై చెప్పారు. కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇస్తున్న విషయాన్ని తమను మాటమాత్రంగా కూడా చెప్పలేదని కోపోద్రిక్తురాలైన బొజ్జమ్మ, వైసీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరామ్కు మద్దతు ప్రకటించారు. బొజ్జమ్మ తండ్రి కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు. ఆయన ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నారు. ఆస్పరి జడ్పీటీసీ సభ్యుడు కూడా. బొజ్జమ్మ భర్తయిన దేవనకొండ ఎంపీపీ రామచంద్రుడు, తన అనుచర వర్గంతోపాటు త్వరలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. కూతురు, అల్లుడు వెళ్లిన తరువాత, కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు మాత్రం టీడీపీలో ఉంటారన్న గ్యారంటీ లేదు. స్థానిక ఎన్నికల నాటికి ఆయన కూడా 'ఫ్యాన్' కిందకు వెళతారన్న వార్తలొస్తున్నాయి.
భగ్గు మంటున్న అంతర్గత విభేదాలు..! పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు..!!
మూడు దశాబ్దాల నుంచి టీడీపీలో కొనసాగుతున్న శాలివాహన కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్ర, ఆయన సతీమణి వరలక్ష్మి (తుగ్గలి జడ్పీటీసీ సభ్యురాలు) కూడా ఇప్పటికే 'సైకిల్' దిగారు. వైసీపీ తీర్థం పుచ్చుకునే ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. కేఈ, తుగ్గలి కుటుంబాల మధ్య కొన్నాళ్ల నుంచి దూరం పెరిగింది. పత్తికొండ టిక్కెట్ ఆశించిన తుగ్గలి నాగేంద్రకు చంద్రబాబు మొండి చేయి చూపారు. కేఈ శ్యామ్బాబుకు టిక్కెట్ ఇచ్చి చేయి అందించారు. సహజంగానే ఇది తుగ్గలి నాగేంద్రకు నచ్చలేదు. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవిని గెలిపించాలని బహిరంగంగానే ప్రచారం చేశారు.
కట్టడి చేస్తానంటున్న బాబు..! కుదరదంటున్న నేతలు..!!
ఎన్నికల్లో అనూహ్య ఫలితాలొచ్చాయి. కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. జగన్ గద్దెనెక్కారు. స్థానిక ఎన్నికల నాటికి కర్నూలు జిల్లా టీడీపీలోని ముఖ్యులైన ద్వితీయ శ్రేణి నాయకులంతా వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలులో మొదలైన ఈ వలసలు, మిగతా జిల్లాలకు కూడా విస్తరిస్తాయనే చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే ఏపిలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.